నా బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయాను.., ఏడేళ్ల చిన్నారి ఉత్తరం చదివి చలించిపోయిన ట్రంప్!
వాషింగ్టన్: ఏడేళ్ల చిన్నారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నే నిలదీసింది. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఓ ఉత్తరంలో ఆయన్ని ప్రశ్నించింది. దీనికి ట్రంప్ కోపం తెచ్చుకోలేదు. పైపెచ్చు ఆ చిన్నారికి రిప్లై కూడా ఇచ్చారు.
ఆ చిన్నారి పేరు ఎవా రోజ్ ఓల్సెన్. 'డియర్ మిస్టర్ ప్రెసిడెంట్' అంటూ ఆ చిన్నారి రాసిన ఉత్తరానికి ట్రంప్ చలించిపోయారు. ఆ చిన్నారికి ధైర్యం చెబుతూ ట్రంప్ తిరిగి ఉత్తరం రాశారు. అందులో ఆమె ఉన్నతిని ఆయన ఆకాంక్షించారు.
అసలేం జరిగిందంటే...
అమెరికాలోని సౌత్ కరొలినాలో టౌన్విల్లే పట్టణం ఉంది. ఈ పట్టణానికి చెందిన ఎవా రోజ్ ఓల్సెన్(7) చదువుకుంటున్న పాఠశాల వద్ద ఓ పధ్నాలుగేళ్ల అబ్బాయి తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటన 2016 సెప్టెంబరులో జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. వీరిలో ఎవా రోజ్ స్నేహితుడు జాకోబ్ కూడా ఉన్నాడు. తుపాకి కాల్పుల్లో గాయపడిన జాకోబ్ మూడ్రోజులు మృత్యువుతో పోరాడి ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచాడు.
ఎవా లేత మనసుపై తీవ్ర ప్రభావం...
పాఠశాల ఆటస్థలంలో ఆడుకుంటున్న స్నేహితుడు జాకోబ్ తన కళ్లెదుటే తూపాకి తూటాలకు బలైపోవడం ఏడేళ్ల ఎవా రోజ్ ఓల్సెన్ లేత మనసుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ఘటన తరువాత ఎవా మానసికంగా బాగా కుంగిపోయింది. తిరిగి పాఠశాలకు కూడా వెళ్లలేని పరిస్థితికొచ్చేసింది. ఆమెకు ఇంటివద్దే చదువు చెప్పించమని వైద్యులు కూడా సూచించారు. కొన్ని రోజులకు ఎవా తేరుకుంది. ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకూడదని అనుకుంది. తన బాధను ఓ ఉత్తరం రూపంలో పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి పోస్ట్ చేసింది.
చిన్నారులను ఎలా కాపాడుతారు?
స్నేహితుడు జాకోబ్ మరణాన్ని మర్చిపోలేని ఎవా 2017 ఆగస్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖ రాసింది. ‘డియర్ మిస్టర్ ప్రెసిడెంట్.. నా పేరు ఎవా రోజ్ ఓల్సెన్. నాకు ఏడేళ్లు. రెండో తరగతి చదువుతున్నాను. గత ఏడాది టౌన్విల్లే ఎలిమెంటరీ స్కూల్ దగ్గర జరిగిన కాల్పుల్లో నా స్నేహితుడు జాకోబ్ ప్రాణాలు కోల్పోయాడు. అది చూసి నేను చాలా భయపడ్డాను. జాకోబ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నాకు తుపాకులు అంటే అసహ్యం. అది నా జీవితాన్ని నాశనం చేసింది. నా బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయాను. మీరు చిన్నారులకు రక్షణ కల్పిస్తారా? మమ్మల్ని ఎలా కాపాడుతారు? ' అంటూ ఆ లేఖలో ప్రశ్నించింది.
లేఖ చూసి చలించిపోయిన ట్రంప్...
ఎవా ఉత్తరాన్ని చూసి చలించిపోయిన అధ్యక్షుడు ట్రంప్ ఆమెకు తిరిగి సమాధానం పంపించారు. ‘డియర్ ఎవా, నీ స్నేహితుడు జాకోబ్ మరణం గురించి నేను, మిసెస్ ట్రంప్ చాలా బాధపడుతున్నాం. నీ గురించి, నీ కుటుంబం గురించి, జాకోబ్ కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం. చిన్నారులు అన్ని విషయాలు నేర్చుకునేది, స్నేహితులతో కలిసి పెరిగేది పాఠశాలలోనే. అలాంటి ప్రదేశంలో భయం ఉండకూడదు. అమెరికాలో చిన్నారులు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా చేయడమే నా లక్ష్యం. అమెరికన్ల రక్షణ గురించి, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మరింత కృషి చేస్తాను. ఏదేమైనప్పటికీ.. నీ జీవితంలో ఎంతో మంది నిన్ను ప్రేమించేవారు, సపోర్ట్ చేసే వారు ఉన్నారు. నీ కలలు సాకారమైతే చూడాలనుకునే వారు ఉన్నారు..' అని ట్రంప్ ఆ చిన్నారికి ఉత్తరం రాసి సంతకం చేసి పంపించారు.
కాల్పుల పేరు చెబితేనే వణుకు...
దేశాధ్యక్షుడు ట్రంప్ నుంచి ఉత్తరం వచ్చిందని తెలియగానే తొలుత ఆశ్చర్యపోయినా, ఆ తరువాత ఆనందపడింది ఎవా రోజ్ ఓల్సెన్. కొద్దిరోజుల తరువాత ఆమెకు ట్రంప్ రాసిన లేఖలో పిల్లల రక్షణ కోసం ఏయే చర్యలు తీసుకుంటానన్నారో చెప్పలేదు కదా అనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే దేశాధ్యక్షుడికి మరో ఉత్తరం రాసింది. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తనకు తోచిన మేరకు తన ఆలోచనలను ఆ లేఖలో రాసింది ఎవా. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉందంటే... ఎక్కడ కాల్పుల ఘటన గురించి విన్నా భీతిల్లుతోంది. దీంతో ఆమె తల్లి ఎవాకు అలాంటి వార్తలేవీ తెలియకుండా జాగ్రత్తపడుతోంది. ఇంట్లో టీవీ కూడా పెట్టడం మానేసిందట.