స్నేహం పరువు తీసిన ట్రంప్ - గోడ కట్టినా ‘కంపు ఇండియా’ దాగలేదు - ‘హౌడీ మోడీ’ ఫలితమంటూ
''ఇండియా చాలా గొప్ప దేశం.. ప్రధాని నరేంద్ర మోడీ నాకు అత్యంత ఆప్తమిత్రుడు.. ఈసారి ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల ఓట్లన్నీ నాకే..'' అంటూ చిలకపలుకులు పలికిన పక్షం రోజులకే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నోటి వెంట ఇండియాను ఉద్దేశించి కంపు వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్ లలో వరుసగా రెండోసారి భారత్ పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. తద్వారా ఆయన ఫ్రెండ్ షిప్ పరువు తీశారని, మోదీతో స్నేహాన్ని చిన్నబుచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Recommended Video
జగన్ చాటుకు వెళ్లి ప్రేమించాలి -హీరో మహేశ్బాబు ఫీలింగా? -పెయిడ్ గుట్టురట్టు: ఎంపీ రఘురామ
ట్రెడింగ్లో హౌడీ మోడీ
డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ తో శుక్రవారం మూడో ప్రెసిడెన్షియల్ డిబేట్ లో పాల్గొన్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. భారత్ ను ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా ఎందుకు వైదొలిగిందో వివరిస్తూ.. ‘‘ప్రపంచంలోని పెద్ద దేశాలు భారీ ఎత్తున కాలుష్యాన్ని వెదజల్లుతోంటే.. దాని నివాణ కోసం అయ్యే ఖర్చులను అమెరికా భరించాలా? ఆ మధ్య నేను ఇండియా వెళ్లను. అక్కడి గాలి మురికిమయం. చైనాలోనూ అంతే. వాళ్ల తప్పిదాలకు మనం మూల్యం చెల్లించాలా?''అని ట్రంప్ సవాలు చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన రెండో డిబేట్ లోనూ.. భారత ప్రభుత్వం ప్రకటింస్తోన్న కరోనా మరణాల సంఖ్యపై అనుమానాలున్నాయని ట్రంప్ అన్నారు. ‘మురికి ఇండియా' వ్యాఖ్యల తర్వాత ట్విటర్ లో ‘హౌడీ మోడీ' టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ట్రంప్ తో మోదీ దోస్తానాపై పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తాయి.
ట్రంప్ వ్యాఖ్యలు బాధాకరం..
ఇండియాలో వాతావరణం మురికిగా ఉంటుందంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన కామెంట్లు బాధాకరమే అయినప్పటికీ.. ఎదుటివారి గౌరవాన్ని బలవంతంగానో, భయపెట్టో పొందలేమని, ట్రంప్ వ్యాఖ్యల తర్వాతైనా భారత్ లో కాలుష్య నియంత్రణ చర్యల్ని వేగవంతం చేయాలని, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, ఎలక్ట్రికల్ వాహనాలను పెంచుకోవాల్సి ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. గతేడాది నవంబర్ లో అమెరికాలో జరిగిన ‘హౌడీ మోడీ' ఈవెంట్ లో ట్రంప్, మోదీ ఒకరినొకరు ప్రాణమిత్రులుగా అభివర్ణించుకోవడం, అమెరికా ఎన్నికల్లో భారత సంతతి ఓటర్లు ట్రంప్ కే ఓటేయాలని మోదీ అభ్యర్థించిన విషయాలను నెటిజన్లు గుర్తుచేశారు.
గోడ కట్టినా కంపు దాగలేదు..
అమెరికాలో హౌడీ మోడీ తరహాలోనే ఈఏడాది ఫిబ్రవరిలో గుజరాత్ లో ‘నమస్తే ట్రంప్' ఈవెంట్ నిర్వహించడం, ట్రంప్ రాక సందర్భంగా అహ్మదాబాద్ సిటీలోని మురికివాడలు కనిపించకుండా భారీ పొడవుతో గోడలు నిర్మించడం తెలిసిందే. ట్రంప్ తాజా కామెంట్లను ప్రస్తావిస్తూ.. ‘‘మనం ఎంతో కష్టపడి గోడలు కట్టి, అంతా బాగుందని బిల్డప్ ఇచ్చినా.. ట్రంప్ ఇక్కడి కంపును పట్టేశారు''అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
హౌడీ మోడీ ఫలితమే ఇది..
ట్రంప్ కామెంట్లపై వెల్లడైన అభిప్రాయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ట్వీట్ హైలైట్ గా నిలిచింది. ఎంతో ఉత్సాహంతో మన ప్రధాని మోదీ అమెరికా వెళ్లి నిర్వహించిన ‘హౌడీ మోడీ' ఈవెంట్ ఫలితమే ఇదని కపిల్ ఎద్దేవా చేశారు. ‘‘డోనాల్డ్ ట్రంప్ తో మోదీ స్నేహ ఫలాలు ఇవే.. 1)ఇండియాలో కరోనా మరణాల సంఖ్యపై అనుమానం, 2)భారత్ లోని గాలి అత్యంత మురికిమయం, 3) పన్నులు బాదడంలో భారత్ బాద్షా అనే బిరుదు. ఈ మూడు ‘హౌడీ మోడీ' ఫలితాలు'' అని సిబల్ పేర్కొన్నారు. సాధారణంగా పొరుగుదేశాలపై విరుచుకుపడే బీజేపీ శ్రేణులు.. ట్రంప్ కామెంట్లపై మౌనం వహించడం గమనార్హం.
నిమ్మగడ్డ రమేశ్ రూ.5కోట్లే - బుగ్గన ఎన్ని బుగ్గలు పట్టినా వేస్ట్ - పింక్ డైమండ్ కథేంటి?: రఘురామ