కరోనామరణాలు లేని బ్రిటీష్ సామ్రాజ్యం: కోవిడ్పై విజయం సాధించినట్లేనా..లాక్డౌన్ ఎత్తివేత పై క్లారిటీ..!
లండన్ : గతేడాది ఇంగ్లాండ్ దేశాన్ని అల్లకల్లోలం చేసిన కోవిడ్ మహమ్మారిపై ఆదేశం క్రమంగా విజయం సాధించినట్లు కనిపిస్తోంది. ఇందుకు తగిన న్ని చర్యలు బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తీసుకోవడంతో కనిపించని కరోనాను దాదాపుగా కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడమే. అవును ఇంగ్లాండ్ ప్రభుత్వం అందించిన లెక్కల ప్రకారం గతేడాది జూలై 30వ తేదీ నుంచి ఇప్పటి వరకు రోజుకు ఒక్క కోవిడ్ మరణం రికార్డు అయ్యేది.
కానీ గత 24 గంటల్లో మాత్రం ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం నాటికి ఇంగ్లాండ్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 112,254గా నమోదైంది. సోమవారం రోజున ఇంగ్లాండ్లో 2009 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,876,000కు చేరింది. అయితే యూకేను మొత్తంగా పరిగణలోకి తీసుకుంటే నాలుగు కొత్త మరణాలు నమోదయ్యాయి.
యూకేలో తగ్గుతూ వస్తున్న మరణాల సంఖ్య
ఇక యూకేలో రోజువారి మరణాల సంఖ్య కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్లో అయితే ఏప్రిల్ మే నెలల్లో సున్నా మరణాలు సంభవించాయని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక సోమవారం రోజున కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం, హాస్పిటల్లో పేషెంట్ల అడ్మిషన్ల సంఖ్య తగ్గడం అదే సమయంలో మరణాలు లేకపోవడం ఆదేశానికి భారీ ఊరటనిచ్చింది.
యూకేలో కరోనా కేసులు తగ్గిపోవడం మరణాల సంఖ్య లేకపోవడం నిజంగా దేశం ఒకరకంగా ఈ మహమ్మారిపై విజయం సాధించిందని చెప్పుకొచ్చారు నలుగురు చీఫ్ మెడికల్ ఆఫీసర్లు. అంతేకాదు తాజా గణాంకాలతో దేశం 4వ దశ నుంచి 3వ దశకు చేరుకుందని చెప్పారు. ఇదంతా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం అదే సమయంలో ప్రజలు కఠినంగా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించడం వల్లే అని వారు స్పష్టం చేశారు.
లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తుందా..?
ఇదిలా ఉంటే కరోనావైరస్ సాధారణ స్థాయిలో ఉందని అయితే ఇక ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం లేదని లేదా చాలా తక్కువ స్థాయిలో వ్యాప్తి చెందుతూ ఉండొచ్చని చెప్పారు. అయితే ఇంగ్లాండ్లో లాక్డౌన్ అమలులో ఉందని ఇక కేసులు దాదాపుగా తగ్గినందున ఆంక్షలు ఎత్తివేసే యోచనలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఉంది. 17మే తర్వాత ఆంక్షల సడలింపుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అంటే ఇండోర్స్లో రెండు కుటుంబాలు కలవడం లేదా ఆరుగురు ఒకేచోట కలవడం, పబ్స్ మరియు రెస్టారెంట్లు లోపలనే కస్టమర్లకు సర్వ్ చేయడం వంటి వాటిపై సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వచ్చే సోమవారం నుంచి ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం, కరచాలనం చేసుకోవడంపై కూడా అనుమతి ఇస్తామని సూచనప్రాయంగా తెలిపారు.
యూకేలో మూడోవంతు యువతకు వ్యాక్సిన్ పూర్తి
ప్రస్తుతం కరోనా మరణాల సంఖ్యతో పాటు కరోనా పాజిటివ్ కేసులు కూడా గణనీయంగా పడిపోయినందున లాక్డౌన్ ఎత్తివేయాలన్న చర్చ కూడా చాలా చోట్ల జరుగుతోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కంటే ముందుగానే లాక్డౌన్ ఎత్తివేయాలని పలువురు బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ముందస్తు ప్రణాళికకే కట్టుబడి ఉంటుందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం యూకేలో మూడోవంతు యువతకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 17,669,379 మందికి రెండు డోసుల టీకా పూర్తికాగా, ఇందులో 33.5శాతం మంది 18 ఏళ్ల వయసున్నవారు కావడం విశేషం. మొత్తంగా ఇప్పటి వరకు 53 మిలియన్ డోసుల టీకాను యూకే ప్రభుత్వం ఇచ్చింది.
Recommended Video
అన్ని జాగ్రత్త చర్యలు పాటించాల్సిందే: నిపుణులు
ఇక యూకేలో పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడం మరణాల సంఖ్య కూడా తగ్గడంతో కోవిడ్కు ముందు జీవనం కొనసాగించవచ్చని చెప్పారు కోవిడ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక దూతగా ఉన్న డాక్టర్ డేవిడ్ నబార్రో. అయితే కచ్చితంగా భౌతిక దూరం పాటించడం, ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఈ రెండు విషయాల దగ్గర రాజీ పడకూడదని వెల్లడించారు. ఓ వైపు వైరస్తో జీవనం సాగిస్తూనే మరో వైపు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని జీవితంలో ముందుకు వెళ్లడమే అని చెప్పారు.