సముద్రం ఉప్పొంగే ప్రమాదం: తుఫాన్ తగ్గినా వెంటాడుతున్న భయం, ఫ్లోరిడాకు రిలీఫ్!
ఇర్మా తుఫాను ప్రస్తుతం జార్జియా, అలబామా, మిస్సిసీపీ, టెన్నెసీల మీదుగా కదిలిపోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Recommended Video
న్యూయార్క్: అమెరికాలో అల్లకల్లోలం సృష్టించిన ఇర్మా తుఫాను కాస్తంత నెమ్మదించింది. ఈదురుగాలులు, వరద ముప్పు కాస్త తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తె ప్రమాదం ఉందని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇర్మా తుఫాను ప్రస్తుతం జార్జియా, అలబామా, మిస్సిసీపీ, టెన్నెసీల మీదుగా కదిలిపోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇర్మా సృష్టించిన భీభత్సం నుంచి ఫ్లోరిడా ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. సహాయక చర్యలకు అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. త్వరలోనే అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాను సందర్శించనున్నారు.
సముద్రం ఉప్పొంగుతుందన్న భయం:
ఇర్మా ధాటికి ఫ్లోరిడా రాష్ట్రంలో దాదాపు 45లక్షల నివాస గృహాలు, వ్యాపార దుకాణాలు గాఢాంధకారంలోనే ఉండిపోయాయి. ఓర్లాండో నగర శివారు ప్రాంతంలోకి వరద నీరు వచ్చి చేరడంతో.. అక్కడి 120ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మియామి, ఫోర్డ్ లారా తదితర ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సముద్రం ఎక్కడ ఉప్పొంగుతుందోనన్న భయం మాత్రం వెంటాడుతుందని తంపా మేయర్ బక్ హార్న్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయుల ఆపన్నహస్తం:
ఇర్మా ధాటికి బాధితులుగా మిగిలిపోయినవారిని ఆదుకునేందుకు అమెరికాలోని భారతీయులు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. బాధితుల్లో భారతీయులు కూడా ఉండటంతో అమెరికాలో భారత రాయబారి నవ్తేజ్ సర్నా భారత అమెరికన్లకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు.
న్యూయార్క్లో ఉంటున్న కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తీ అట్లాంటా, తంపా తదితర ప్రాంతాల్లో ఇండో-అమెరికన్లకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సేవా ఇంటర్నేషనల్, అమెరికా తెలుగు అసోసియేషన్, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా, ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా తదితర సంస్థలు హరికేన్ బాధితులకు ఆహారం, వసతిని సమకూరుస్తున్నాయి.
తేరుకుంటున్న టెక్సాస్:
హరీకేన్ హార్వీ ధాటికి విలవిల్లాడిన టెక్సాస్ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. స్తంభించిపోయిన జనజీవనంలో ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. బాధితులు తమ నివాసాలను పునరుద్దరించుకుంటున్నారు.
సేవా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో 800మంది భారత అమెరికన్లు శిథిలాల తొలగింపు, పునర్నిర్మాణ చర్యల్లో పాల్గొంటున్నారు. భారతీయ రెస్టారెంట్ల నుంచి ఇండో-అమెరికన్లకు ఆహారం సరఫరా చేస్తున్నారు. హార్వీ ఎఫెక్ట్ మొదలైనప్పటటి నుంచి హోస్టన్ లోని రెస్టారెంట్ల నుంచి 30వేల భోజనాలు అందించినట్లు కఫే ఇండియా యజమాని దినేష్ పురోహిత్ తెలిపారు.
క్యూబాలో ప్రాణ నష్టం:
హరీకేన్ ఇర్మా ధాటికి క్యూబాలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. రాజధాని హవానాతో పాటు పలు దీవుల్లో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 10మంది మృత్యువాతపడ్డారు. వరదలు ముంచెత్తడం, విద్యుదాఘాతంతో, భవనాల కూలడంతో ప్రాణ నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.