హనీమూన్ వెళ్లొచ్చారు.. విడాకులు అడుగుతున్నారు, అసలేం జరిగిందంటే...
దుబాయ్: ఓ జంటకు కొత్తగా పెళ్ళైంది. హనీమూన్ కోసం యూరప్ కూడా వెళ్లారు. అక్కడ ఏడు పగళ్లు, ఆరు రాత్రులు గడిపారు. ఇంటికి తిరిగొచ్చిన వెంటనే విడాకులు కావాలంటూ భార్యభర్తలిద్దరూ కోర్టును ఆశ్రయించారు. అరె.. కొత్తదంపతుల మధ్య మరీ విడిపోయేంతగా ఏం మనస్పర్థలు వచ్చుంటాయబ్బా.. అని అశ్యర్యపోతున్నారా? అయితే చదవండి!
దుబాయ్ నగరానికి చెందిన ఓ యువతి, యువకుడికి కొంతకాలం క్రితం నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే వివాహం చేసుకున్న వారు హనీమూన్ కోసం యూరప్ వెళ్లారు. అక్కడ ఏడు పగళ్లు, ఆరు రాత్రులు గడిపారు. కానీ ఇద్దరి మధ్య 'శృంగారం' మాత్రం జరగలేదు.
భర్త తనను తాకేందుకు కానీ, తన పక్కన పడుకునేందుకు కానీ భార్య అంగీకరించలేదు. దీంతో ఏడు రోజుల అనంతరం వారు తిరిగి స్వదేశం చేరుకున్నారు. దుబాయ్ ఎయిర్పోర్టులో దిగీ దిగగానే భార్య తన భర్తతో కాకుండా నేరుగా తన పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ పరిణామాలతో షాక్కు గురైన భర్త.. తనకు ఈ భార్య వద్దని, తాను ఆమెనుంచి విడిపోవాలనుకుంటున్నానని, విడాకులు మంజూరు చేయాలంటూ దుబాయ్ షరియా కోర్టును ఆశ్రయించాడు. తనతో లైంగికంగా కలిసేందుకు ఆమె అంగీకరించలేదని, ఇష్టపడడంలేదని, కనీసం తన పక్కన కూడా పడుకోవడం లేదనే కారణాలను అతడు పేర్కొంటున్నాడు.
ఇక అతడి భార్య వాదన మరోలావుంది. తన భర్త చాలా పిసినారి అని, తన కోసం అసలు డబ్బు ఖర్చుచేయడం లేదని, ఇలాంటివాడితో తాను కలిసుండలేనని, విడాకులు ఇప్పించాలని అంటోంది. అయితే తన భార్య చాలా విలాసవంతంగా ఉండాలని కోరుకుంటోందని ఆమె భర్త వాపోయాడు.
వీరిద్దరికి పలు దఫాలుగా కౌన్సిలింగ్లు నిర్వహించినా ఆశించిన ఫలితం లేకపోవడంతో కేసును షరియా కోర్టుకు బదిలీ చేస్తున్నామని, త్వరలోనే వాదనలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.