కూచిభొట్ల హత్య: హంతకుడికి జీవిత ఖైదు విధించిన అమెరికా కోర్టు..
అమెరికా: అమెరికాలో హత్యకు గురైన హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల(33) హంతకుడికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పుపై కూచిభొట్ల భార్య సునయన హర్షం వ్యక్తం చేశారు.
జాత్యహంకార హత్యే, ఖండిస్తున్నాం: శ్రీనివాస్ హత్యపై ట్రంప్ తొలిసారి, ఏమన్నారంటే..?
కాగా, గతేడాది స్నేహితుడితో కలిసి కాన్సాస్ లోని ఓ బార్ కి వెళ్లిన సమయంలో ప్యురింటన్(52) అనే వ్యక్తి శ్రీనివాస్ పై కాల్పులకు తెగబడ్డాడు. 'నా దేశం నుంచి వెళ్లిపోండి' అని పెద్దగా అరుస్తూ అతను కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కూచిభొట్ల చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. శ్రీనివాస్ స్నేహితుడు అలోక్ మాదసాని గాయాలతో బయటపడ్డారు. శ్రీనివాస్, అలోక్ మాదసానిలపై కాల్పుల సమయంలో ఇయాన్ గ్రిలట్ అనే వ్యక్తి నిందితుడు ప్యురింటన్ ను అడ్డుకోబోయాడు.
ఈ క్రమంలో అతనికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. కాగా, భర్త దూరమవడంతో శ్రీనివాస్ భార్య సునయన తీవ్ర మనస్థాపం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగానికి కూచిభొట్ల భార్య సునయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూచిభొట్లపై దాడిని ఆయన ఖండించారు.
ఇదిలా ఉంటే, ప్యురింటన్ జీవితఖైదుపై కొంతమంది న్యాయవాదులు మాట్లాడుతూ... అతను 50ఏళ్ల తర్వాత గానీ పెరోల్ పై బయటకొచ్చే అవకాశం లేదన్నారు.