ప్రత్యర్థి భారీగా ఖర్చు చేసినా.. అమెరికా దిగువ సభకు తెలుగు మహిళ!
వాషింగ్టన్: హైదరాబాదులో పుట్టిన, కృష్ణా జిల్లాకు చెందిన మహిళ అమెరికా చట్టసభలో అడుగు పెట్టనుంది. ఆమె పేరు అరుణా మిల్లర్. వయస్సు 53. తద్వారా అమెరికా కాంగ్రెస్లో అడుగు పెట్టనున్న మరో భారతీయ మహిళగా రికార్డు సృష్టించనున్నారు. మేరీల్యాండ్లోని డెమోక్రాట్ల కంచుకోటగా ఉన్న సిక్స్త్ కాంగ్రెస్సనల్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ నుంచి ప్రతినిధుల సభకు పోటీ పడుతున్నారు.
తన ప్రత్యర్థి డేవిడ్ ట్రోన్పై విజయం సాధించడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. ఓ సంపన్న వ్యాపారవేత్త అయిన ట్రోన్ ఈ ఎన్నికల్లో విజయం కోసం రూ. 65 కోట్లు ఖర్చు పెట్టగా, అరుణ కేవలం రూ.9 కోట్లు మాత్రమే ఖర్చు చేశారట. ఆమె విజయం సాధించనుండటం ఖాయమని చెబుతున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన కాట్రగడ్డ వెంకట రామారావుకు ఐబీఎంలో ఉద్యోగం రావడంతో 1972లో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అప్పుడు అరుణ వయసు ఏడేళ్లు. అక్కడే చదువుకుంటూ పెరిగిన అరుణ, న్యూయార్క్లో హైస్కూల్ విద్యాభ్యాసాన్ని, ముస్సోరీ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
కాలేజీలో తాను ప్రేమించిన డేవిడ్ మిల్లర్ను 1990లో పెళ్లి చేసుకున్నారు. 2004లో డెమోక్రటిక్ పార్టీలో చేరిన ఆమె అంచెలంచలుగా ఎదిగారు. ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. ఆమెకు మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. 2010లో హౌస్ ఆఫ్ డెలిగేట్స్కు ఎన్నికైన అరుణా మిల్లర్.. తన ప్రతిభతో అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు.