కిమ్ మరణంపై ట్రంప్ చెప్పినట్లే.. ఉ.కొరియా బోర్డర్లో బుల్లెట్ల వర్షం.. అమెరికాలో కరోనా విలయం..
పిల్ల వెబ్సైట్ల నుంచి బడా మీడియా కంపెనీల దాకా ఆయన మరణాన్ని ధృవీకరించాయి.. మృతదేహం తాలూకు ఫొటోలు కూడా ప్రచురించాయి.. భూగోళమంతా వాటిని నమ్మడానికి సిద్ధపడినా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం వాటిని తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు.. అవును, ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మరణించడం నిజం కాదని, ఆయన సేఫ్ గా ఉన్నారని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పిందే నిజమైంది. 20 రోజుల గ్యాప్ తర్వాత, పుకార్లకు చెక్ పెడుతూ కిమ్ ప్రజలముందుకొచ్చారు. ప్రియమైన శతృవు పునరాగమనాన్ని ట్రంప్ సెలబ్రేట్ చేసుకున్నారు.
Recommended Video
ఖుషీగా ఉందంటూ..
ఉత్తరకొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పూర్తి ఆరోగ్యంతో ఉండటం, మళ్లీ ప్రజల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉందని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. అంతేకాదు, సున్చాన్ సిటీలో కిమ్ ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభిస్తోన్న ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. ఒకప్పుడు ఆటంబాంబులు వేసేస్తానంటూ ఒకరినొకరు తిట్టుకున్న ఈ ఇద్దరు నేతలు.. ఆ తర్వాతి కాలంలో శాంతి చర్చల ద్వారా దగ్గరకావడం తెలిసిందే. కాగా, కిమ్ బతికే ఉన్నారనడానికి ఆధారంగా కొరియన్ మీడియా విడుదల చేసిన ఫొటోలు నిజమైనవో, కావో వైట్ హౌస్, అమెరికకా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇంకా నిర్ధారించలేదు. ఆలోపే ప్రెసిడెంట్ ట్రంప్ హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం గమనార్హం.
తిరిగొస్తూనే తింగరి పనులు..
ఊబకాయం, స్మోకింగ్, పని ఒత్తిడి కారణంగా కిమ్కు గుండె జబ్బు వచ్చిందని, రహస్య ప్రాంతంలో చేయించుకున్న ఆపరేషన్ వికటించడంతో ఆయన ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిపోయారని, కిమ్ మరణం దాదాపు ఖరారుకావడంతో ఆయన చెల్లెలు కిమ్ యో జాంగ్ అధికారపగ్గాలు చేపడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ గత శుక్రవారం కిమ్ పున:దర్శనంతో అవన్నీ తప్పని తేలిపోయింది. అధినేత పునరాగమనానికి సూచనగా ఉత్తరకొరియా సైనికులు.. దక్షిణకొరియా సరిహద్దులో బుల్లెట్ల వర్షం కురిపించారు. ‘‘మా బంకర్లు, పోస్టులే టార్గెట్ గా నార్త్ కొరియా సైనికులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. దీనిపై విచారణ జరుపుతున్నాం''అని సౌత్ కొరియా అధికారులు ప్రకటించారు.
కిమ్ అనారోగ్యం నిజమే..
దాదాపు 20 రోజుల తర్వాత కిమ్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వడంతో ఆయన మరణంపై సాగిన చర్చకు ఫుల్ స్టాప్ పడింది. కానీ జనం ముందుకు రావడానికి ఆయన ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారనే అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నార్త్ కొరియా అధికారిక మీడియా శుక్రవారం విడుదల చేసిన ఫొటోల్లో కిమ్ కుడిచేతి మణికట్టు వద్ద పంక్చర్ గుర్తులుండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ‘‘కిమ్ చేతిపై గుర్తులు రేడియల్ ఆర్టరీ పంక్చర్ లాగా కనిపిస్తున్నాయి. తరచూ స్టెంట్ ప్లేస్మెంట్ కోసం కొరోనరీ ఆర్టరీలను యాక్సెస్ చేయడానికి ఈ విధానాన్ని వాడతారు''అని నిపుణులు చెప్పిన అభిప్రాయాన్ని పలు వార్తా సంస్థలు ప్రచురించాయి.
అమెరికాలో మరణమృదంగం..
కిమ్ జాంగ్ పునరాగమనంపై ట్రంప్ సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, అమెరికాలో కరోనా పరిస్థితులు మాత్రం చాలా బాధాకరంగా తయారయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే అక్కడ కొత్తగా 1435 మంది మృత్యువాతపడ్డారు. అంతకుముందు రెండ్రోజులుగా మరణాల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడం గమనార్హం. అగ్రరాజ్యంలో కొవిడ్-19 రోగుల సంఖ్య 11.6లక్షలకు పెరిగింది. అందులో 1.73లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, మరణాల సంఖ్య 68 వేలకు చేరువైంది. వైరస్ ఎపిసెంటర్ న్యూయార్క్ లో చావుల సంఖ్య ఏకంగా 25వేలకు దగ్గరగా ఉంది. ఇంతజరుగుతున్నా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తేయడం గమనార్హం.