నేను నోబెల్ పురస్కారానికి అర్హుడిని కాదు, ఎవరికివ్వాలంటే: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఒత్తిడి, ఇప్పటికే అష్టకష్టాల్లో ఉన్న తాము భారత్తో యుద్ధం చేస్తే తమకే నష్టమని పాక్ భావించడం, వీటికి తోడు జెనీవా ఒప్పందం.. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇటీవల తమ కస్టడీలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్కు పాక్ ప్రభుత్వం విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్లో ట్విట్టర్ ట్రెండ్ అయింది. దీనిపై తాజాగా, ఇమ్రాన్ స్పందించాడు.
తాను నోబెల్ పురస్కారానికి అర్హుడిని కాదని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. తాను అర్హుడిని కాదని చెబుతూ, మరోవైపు ఆ పురస్కారానికి అర్హులు ఎవరో చెప్పాడు. కాశ్మీర్ సమస్యను అక్కడి ప్రజల అభీష్టానికి అనుగుణంగా పరిష్కరించి, శాంతికి, మానవాభివృద్దికి ఎవరైతే మార్గం సుగమం చేస్తారో, వారు నోబెల్ పురస్కారానికి అర్హులు అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు.
పాక్ భూభాగంలో పడిపోయిన భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను భారత్కు అప్పగిస్తామని ఇమ్రాన్ ఖాన్ పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మరుసటి రోజు అభినందన్ను వాఘా-అటారీ సరిహద్దులో అప్పగించారు.
అభినందన్ను భారత్కు అప్పగించడంతో ఇమ్రాన్ ఖాన్కు నోబెల్ పురస్కారం ఇవ్వాలనిపెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇమ్రాన్ఖాన్ను పొగుడుతూ ట్వీట్లు చేశారు పాకిస్తాన్ ప్రజలు. ఇరు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు యుద్ధ సైనికుడిని తిరిగి అప్పగించేందుకు సిద్ధపడిన పాక్ ప్రధానికి అత్యున్నత నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.