కరోనా సోకి 4 లక్షల మంది మృతి: స్మారక స్థూపం వద్ద జో బిడెన్ కన్నీరు: డెలావర్ బిడ్డగా
వాషింగ్టన్: మరి కొన్ని గంటలు. అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పడి సంభవించబతోంది. 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమం ఆరంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజధాని వాషింగ్టన్.. దీనికి వేదిక కాబోతోంది. ఇదివరకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని వాషింగ్టన్లో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 48 గంటలు ముందుగానే వాషింగ్టన్ను మిలటరీ జోన్గా ప్రకటించారు.
Recommended Video
లింకన్ స్మారక స్థూపం వద్ద నివాళి..
ప్రమాణ స్వీకారారినికి కొన్ని గంటల ముందు- జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ లింకన్ స్మారక స్థూపాన్ని సందర్శించారు. భయానక కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారికి నివాళి అర్పించారు. బిడెన్ భార్య, అమెరికా కాబోయే ప్రథమ మహిళ జిల్ బిడెన్, కమలా హ్యారిస్ భర్త డగ్, ఎమ్హోప్తో ఇందులో పాల్గొన్నారు. సుమారు అరగంట పాటు ఆ నలుగురు అక్కడే గడిపారు. నివాళి అర్పించే సమయంలో జో బిడెన్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటితో ఆయన నివాళి అర్పించారు. ప్రతి అమెరికన్.. కరోనా మృతులను స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు. డెలావర్లో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానని, డెలావర్ బిడ్డగా గర్విస్తున్నానని చెప్పారు.
నాలుగు లక్షల మందికి పైగా
అమెరికాలో కరోనా బారిన పడి ఇప్పటిదాకా 4,11,434 మంది మరణించారు. రోజూ రెండు వేలకు పైగా మరణాలు అక్కడ నమోదవుతున్నాయి. 2,48,02,220 కేసులు నమోదు అయ్యాయి. అత్యధిక మరణాలు ఆర్థిక రాజధాని న్యూయార్క్లో నమోదు అయ్యాయి. 41,377 మంది కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. 13,01,128 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, ఇల్లినాయిస్లల్లో 10 లక్షలకు పైగా కరోనా కేసులు రికార్డు అయ్యాయి. కాలిఫోర్నియా-34,435, టెక్సాస్-33,245, ఫ్లోరిడా-24,436, ఇల్లినాయిస్-20,153 మంది మరణించారు.
విద్యుద్దీప కాంతులతో..
జో బిడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని లింకన్ స్మారక స్థూపాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. నాలుగు లక్షల మందికి పైగా మరణించడానికి గుర్తుగా 400 దీపాలను ఈ స్మారక స్థూపానికి అమర్చారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్, సియాటెల్లోని స్పేస్ నీడిల్ భవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ కార్యాలయాలు, ఇతర ప్రధాన ప్రభుత్వ భవనాలు ప్రస్తుతం భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నాయి. ఎలాంటి దాడులు చోటు చేసుకోకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాలరు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
25 వేలకు పైగా నేషనల్ గార్డులతో..
కేపిటల్ బిల్డింగ్, సుప్రీంకోర్టు భవనాల వద్ద ఏడు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఇనుప బ్యారికేడ్లను అమర్చారు. రౌండ్ ద క్లాక్ విధానంలో సాయుధులైన సైనికులు పహారా కాస్తున్నారు. ఒక్క వాషింగ్టన్లోనే 25 వేలమందికి పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డులను మోహరింపజేశారు. ఇదివరకు సివిల్ వార్ నడుస్తోన్న సమయంలో అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పటి దృశ్యాలు ప్రస్తుతం వాషింగ్టన్లో నెలకొన్నాయి.