దారుణం: అమెరికా అధ్యక్ష రేసు... తులసీ గబ్బార్డ్ హిందూజాతీయ ముద్రవేసే ప్రయత్నం
వాషింగ్టన్: వచ్చే అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలవాలని అనుకుంటున్న హవాయి డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి తులసీ గబ్బార్డ్కు చేదు అనుభవం ఎదురవుతోంది. మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయట. తాను హిందూ జాతీయురాలిని అయినందుకు విమర్శలు వస్తున్నాయని ఆమె వాపోయారు.
అంతేకాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోవడాన్ని కూడా తప్పుబడుతున్నారని తులసి వాపోతున్నారు. తనకు, తన మద్దతుదారులకు మతం రంగు పులిమి తమ పైన హిందూ జాతీయవాదులన్న ముద్ర వేస్తున్నారని తులసీ గబ్బార్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి హిందూ మహిళగా పేరొందిన తులసీ గబ్బార్డ్ 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ నెల 11వ తేదీన ప్రకటించారు. తాను భారత ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న విషయాన్ని భూతద్దంలో చూపి తనపై మతం ముద్ర వేస్తున్నారన్నారు.
అమెరికా అధ్యక్ష బరిలో హిందూ మహిళ: ట్రంప్పై పోటీకి తులసీ గబ్బార్డ్ సిద్ధం
అమెరికా చట్టసభలకు ఎన్నికైన తొలి హిందువును తాను అయినందుకు గర్విస్తున్నానని తులసీ గబ్బార్డ్ తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న తొలి హిందువును అయినందుకు కూడా గర్వంగా ఉందని చెప్పారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోడీని కలుసుకున్నారని ఆమె గుర్తు చేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు పోటీపడుతున్న మరో భారత సంతతి మహిళ, సెనేటర్ కమలాహారిస్ ఆదివారం ప్రచారాన్ని ప్రారంభిస్తూ ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పించారు.