ఏక్ దమ్ జోష్... ట్రంప్ హల్చల్ మామూలుగా లేదు... అందర్నీ కిస్ చేస్తానంటూ...
కోవిడ్ 19 నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కొద్దిరోజులకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రచార పర్వంలోకి దూకారు. గతంలో కంటే మరింత హుషారుగా... ఉత్సాహంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈసారి కూడా విజయం తమదేనని... మరో నాలుగేళ్లు వైట్ హౌస్లో తామే ఉండబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం(అక్టోబర్ 12) రాత్రి ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అక్కడి ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు.
ఇక వైట్హౌస్ గడప దాటనున్న ట్రంప్: కరోనా మాయం: టెస్టింగ్ ఏంటో తెలుసా?: కంచుకోటలో తొలి ర్యాలీ
మరో నాలుగేళ్లూ మనమే.. : ట్రంప్
'ఇప్పుడు నేను చాలా శక్తివంతంగా ఉన్నాను. మీ ప్రార్థనలతో త్వరగా కోలుకున్నాను. ఆ జనంలోకి నడుస్తాను... అక్కడ ప్రతీ ఒక్కరినీ కిస్ చేస్తాను... అబ్బాయిలను,అందమైన అమ్మాయిలను,అందరినీ ముద్దాడుతాను... ఇప్పటినుంచి సరిగ్గా 22 రోజుల్లో మనం ఎన్నికల్లో గెలవబోతున్నాం. మరో నాలుగేళ్లు వైట్ హౌస్లో మనమే ఉండబోతున్నాం.' అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ఫ్లోరిడా ఎన్నికల క్యాంపెయిన్కు కొద్ది గంటల ముందే ఆయనకు కోవిడ్ 19 నెగటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ట్రంప్ మరింత ఉత్సాహంతో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.
ట్రంప్ కంటే ముందున్న బైడెన్...
ట్రంప్ తన ప్రత్యర్థి అయిన డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో... అక్కడి జన సమూహం 'వి లవ్యూ...' అటూ నినదించడం గమనార్హం. నిజానికి ఫ్లోరిడాలో ట్రంప్ కంటే బైడెనే ముందున్నారు. ఇక్కడ బైడెన్కు 3.7శాతం పాయింట్లు ఎక్కువగా ఉన్నట్లు అమెరికా సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2016లోనూ అప్పటి డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్పై ట్రంప్ స్వల్ప తేడాతోనే గెలిచారు. ప్రస్తుతం అమెరికాలోని అన్ని రాష్ట్రాల ట్రెండ్ను పరిశీలిస్తే... ట్రంప్ 42.1శాతం పాయింట్లతో,జో బైడెన్ 52.1శాతం పాయింట్లతో ఉన్నారు. అంటే,ట్రంప్ కంటే జో బైడెన్ 10.1శాతం పాయింట్లు ముందున్నారు.
ట్రంప్పై బైడెన్ ఆగ్రహం..
మరోవైపు ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్పై జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ బాధ్యతారాహిత్యానికి,పట్టి లేని తనానికి ఇది నిదర్శనమన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేకపోవడంతోనే దాదాపు 15వేల మంది ఫ్లోరిడా ప్రజలను వైరస్ బలితీసుకుందని ఆరోపించారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన ట్రంప్ ఆ తర్వాత 4 రోజులకే డిశ్చార్జి అయి హడావుడిగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. వైరస్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే ట్రంప్ జనంలోకి రావడం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా ట్రంప్కు కోవిడ్ 19 నెగటివ్గా తేలినట్లు వైద్యులు ప్రకటించడంతో ఈ విమర్శలకు తెరపడే అవకాశం ఉంది.
కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ విఫలం...
ట్రంప్ ఎన్నికల ర్యాలీలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని సాండ్ఫోర్డ్ కోర్టులో లా సూట్ కూడా దాఖలైంది. అయితే దీనిపై ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్ బిల్ స్టెపైన్ మండిపడ్డారు. మరోవైపు,
అమెరికాలో చాలామంది పౌరులు ట్రంప్ ప్రభుత్వం కరోనాను డీల్ చేయడంలో విఫలమైందని భావిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దాదాపు రెండో వంతు ఓటర్లు ట్రంప్ కరోనా విషయంలో విఫలమయ్యాడని భావిస్తున్నట్లు తెలిపాయి. అలాగే 62శాతం మంది కరోనాపై ట్రంప్ కామెంట్లను అంతగా విశ్వసించట్లేదని అభిప్రాయపడినట్లు తెలిపాయి.