పని భారంతో నేను కుటుంబాన్ని చాలా మిస్ అయ్యాను: ఇంద్రా నూయి
ఆమె ఓ దిగ్గజం... ఓ దిగ్గజ కంపెనీకి సీఈఓగా విజయవంతంగా నడిపించారు. దాదాపు 12 ఏళ్లుగా ఆ కంపెనీ సీఈఓగా ఉన్న ఆమె ఎట్టకేలకు పదవీవిరమణ చేయాల్సి వచ్చింది. ఆమె భారత సంతతి వ్యక్తి ఇంద్రా నూయి. ప్రముఖ శీతలపానీయాల సంస్థ పెప్సీకోకు సీఈఓగా వ్యవహరించారు. బుధవారం ఆమె పదవీవిరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా పెప్సీకోతో తనకున్న సంబంధాన్ని అక్కడ పనిచేసిన మధుర జ్ఞాపకాలను ఆమె నెమరేసుకున్నారు. తను ఇంకా పనిచేసేందుకు కావాల్సిన ఇంధనం తనలో ఉందని అన్నారు. అయితే ప్రతిఒక్కరూ పదవీవిరమణ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది తనవంతు అని ...ఇక శేష జీవితాన్ని కుటుంబంతో గడుపుతానని చెప్పుకొచ్చారు ఇంద్రా నూయి.
2006లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఇంద్రా నూయి
చెన్నైలో పుట్టిన ఇంద్రా నూయి అమెరికా దిగ్గజ కంపెనీ పెప్సీకోకు 2006లో సీఈఓగా ఎంపికయ్యారు. ఇక ఆమె ప్రస్థానంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇంద్రానూయి అందుకున్న విజయాన్ని తాము అందుకోవాలని భారత యువత కలలు కంటోంది. పెప్సీకో క్వార్టర్ ఫలితాల విడుదల సమయంలో ఆమె ప్రసంగించారు. "ఒక కంపెనీకి 12 ఏళ్ల పాటు సీఈఓగా వ్యవహరించడం అంటే కత్తిమీద సాములాంటిది. అయితే ఇంకా పనిచేసేందుకు కావాల్సిన ఇంధనం నాలో మిగిలే ఉంది. ఇకపై జీవితంలో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉంది. ఇకపై ఎక్కువ సమయం కుటుంబంతో గడపాలని భావిస్తున్నాను. అదే సమయంలో మరో తరానికి ఈ దిగ్గజ కంపెనీకి సేవలందించే అవకాశం కల్పించాలని భావించాను"అని నూయి అన్నారు. ఎంతో మంది బోర్డు ఎగ్జిక్యూటివ్లు, అసోసియేట్లు, ఇతరత్రా కస్టమర్లు, వాటాదారులతో కలిసి పనిచేయడం చాలి సంతోషాన్నిచ్చిందన్నారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
అతికొద్దిమంది మహిళా సీఈఓలలో ఇంద్రానూయి ఒకరు
ఇక పెప్సీకోతో ఇంద్రానూయికి 24 ఏళ్ల బంధం ఉంది. అందులో గత 12 ఏళ్లుగా ఆమె సీఈఓగా వ్యవహరించారు. అయితే కొత్త సీఈఓ బాధ్యతలు తీసుకున్నాక కొన్నిరోజుల వరకు అంటే 2019 మొదటి వరకు ఆమె ఛైర్మెన్గా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే ఆగష్టులో పెప్సీకో కొత్త సీఈఓగా రేమన్ లాగ్వార్టాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎంపిక చేశారు. ఇక బుధవారం ఆయన కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఇంద్రానూయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతికొద్ది మంది మహిళా సీఈఓలలో ఒకరుగా ఉన్నారు. ఫోర్బ్, ఫార్చూన్ జాబితాలో ఎప్పుడూ ఇంద్రానూయి అత్యంత శక్తివంతమైన మహిళా సీఈఓల విభాగంలో చోటుపొందేవారు. ఫార్చూన్ 500 కంపెనీలకు మహిళలు సీఈఓలుగా వ్యవహరిస్తున్న వారిలో ఐదుశాతం మంది మాత్రమే ఉండగా అందులో ఒకరు ఇంద్రానూయి.
పనిలో పడి కుటుంబాన్ని చాలా మిస్ అయ్యాను..మీరు అలా చేయొద్దు
ఇక నూయీ కుటుంబ నేపథ్యానికి వస్తే... ఆమెకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు ఆమె గొంతువిప్పి మాట్లాడారు. అంతేకాదు మహిళలు ఓ వైపు ఇంటిని చక్కబెడుతూనే మరోవైపు ఆఫీసులో పనిచేయడం ఎంతకష్టమో ఆమె వివరించారు. ఇక కెరీర్ చివరి అంకంలో ఉన్న ఇంద్రానూయి తన జీవితంలో ఎలాంటి పాఠాలు నేర్చుకుందో తన అనుభవాలను చెప్పారు. "ఈ భూమి పై మనకు అతి తక్కువ సమయం ఉంటుంది. ఈ సమయంలోనే అత్యంత ఇష్టంగా భావించే వారికి సమయం కేటాయించాలి. నేను వృత్తిరీత్త ఉన్నతస్థానాలకు ఎదిగాను. కానీ నా కుటుంబంతో అతి తక్కువ సమయం గడిపాను. నా పిల్లలతో నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకున్న ప్రతిసారీ అది సాధ్యమయ్యేది కాదు. అందుకే నేను మీకు చెబుతున్నా.. జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ కుటుంబంతో గడపండి. " అని ఇంద్రా నూయి చెప్పారు.