నియంత్రణ రేఖ దాటుకుని.. మూడు కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లోని బాలాకోట్ సమీపంలో ఉన్న జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై భీకర దాడి తరువాత పాకిస్తాన్ ప్రతీకార దాడికి ప్రయత్నించింది. బుధవారం ఉదయం పాకిస్తాన్ వైమానిక దళానికి చెందన ఎఫ్-16 జెట్ నియంత్రణ రేఖను దాటుకుని, భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర లోనికి చొచ్చుకు వచ్చి, అత్యంత కీలకమైన నౌషేరా సెక్టార్ పై గాల్లో చక్కర్లు కొట్టింది. మనదేశ సైనిక శిబిరాలు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపించారు పాక్ వైమానిక దళ జవాన్లు. అవి ఏవీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి.
భారత ఆర్మీ శిబిరాలే టార్గెట్..
రాజౌరీ జిల్లా పరిధిలోని నడియాన్, లామ్ ఝంగార్, కెర్రి, పూంఛ్ జిల్లాలో భీమ్ వర్ గల్లీ హమీర్ పూర్ ప్రాంతాల్లో బాంబులు కురిపించింది. దీనితోపాటు పాకిస్తాన్ వైమానిక దళ పైలెట్ ఒకరు ప్యారాషూట్ సహాయంతో నేలపై దిగినట్లు సమాచారం ఉంది. దీన్ని గమనించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. మిగ్ 21తో పాక్ ఎయిర్ క్రాఫ్ట్ ను వెంటాడారు. నేలకూల్చారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ధృవీకరించారు. భారత్ పేల్చి వేసిన రెండు ఎయిర్ క్రాఫ్టుల్లో ఒకదాని శకలాలు భారత భూభాగంపై, మరొక ఎయిర్ క్రాఫ్ట్ శకలాలు పాక్ భూభాగం మీద పడ్డాయని ఆసిఫ్ గఫూర్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై కొంత గందరగోళం నెలకొంది.
ఎక్కడుందీ నౌషెరా లోయ..
నిజానికి లామ్ లోయ భారత భూభాగంలోనిదే. నౌషెరా సెక్టార్ పరిధిలో ఉంటుంది. పాకిస్తాన్ సరిహద్దులను ఉల్లంఘించి, భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చింది ఈ సెక్టార్ లోనే. రాజౌరీ జిల్లాలో ఉండే ఈ సెక్టార్.. శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి 10 కిలోమీటర్ల దూరం మాత్రమే. నియంత్రణ రేఖకు అతి సమీపంలో ఉంటుంది. భౌగోళికంగా భారత సైన్యానికి కీలకమైనది కూడా. నియంత్రణ రేఖ దాటితే.. పాకిస్తాన్ లోని ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్.. ఈ సెక్టార్ కు అతి సమీపంలో ఉండే ప్రాంతం.
పూంఛ్ వద్ద కూడా ఉల్లంఘనకు యత్నం.. తరిమికొట్టిన సుఖోయ్?
పూంఛ్ సెక్టార్ పరిధిలో కూడా పాక్ కు చెందిన మూడు జెట్ ఫైటర్లు నియంత్రణ రేఖను దాటి భారత్ వైపు చొచ్చుకుని రావడానికి ప్రయత్నించినట్లు సైనికాధికారులు చెబుతున్నారు. అక్కడ పహారా కాస్తున్న సుఖోయ్ ఎస్ యు-30 యుద్ధ విమానంతో అధికారులు వాటిని తరిమి కొట్టినట్లు సమాచారం.