చైనాలో ఐస్క్రీంలో కరోనా మహమ్మారి: వెయ్యి మందికిపైగా క్వారంటైన్లోకి
బీజింగ్: కరోనావైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి ఆ వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. తాజాగా, చైనాలో తయారైన ఐస్క్రీంలోనూ కరోనా ఆనవాళ్లు కనిపించినట్లు తేలింది. దీంతో ఆ ఐస్క్రీమ్ తిన్నవారందరినీ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.
బీజింగ్కు సమీపంలోని తియాన్జిన్ ప్రాంతంలోని ఓ ఫుడ్ కంపెనీ తయారుచేసిన ఐస్క్రీంలో కరోనా ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆ బ్యాచ్లో ఉత్పత్తి అయిన వేల ఐస్క్రీమ్ కార్టన్లను సదరు సంస్త వెనక్కి తీసుకుంటోంది. ఈ బ్యాచ్లో ఇప్పటి వరకు 390 కార్టన్లను మాత్రమే విక్రయించారని, మరో 29వేల కార్టన్ల ఐస్క్రీంలను ఇంకా విక్రయించలేదని చైనా అధికారులు తెలిపారు. ఈ అమ్మకాలు ఏయే ప్రాంతాల్లో జరిగాయో గుర్తించే పనిలో ఉన్నారు.
కాగా, ఈ ఐస్క్రీం తయారీకి న్యూజిలాండ్, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న పిండి పదార్థాలను వాడినట్లు చైనా తెలిపింది. ఈ ఐస్క్రీం కారణంగా ఎవరైనా వ్యక్తులు వైరస్ బారినపడ్డారా? లేదా? అనే విషయం తెలియదని అధికారులు తెలిపారు. దీంతో ఆ సంస్థను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. సంస్థలోని ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆహార పదార్థాలతో కరోనావైరస్ వ్యాపించడం తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ విదేశాల నుంచి వచ్చే ఆహార ఉత్పత్తుల్లో కరోనావైరస్ వెలుగుచూస్తున్నట్లు చైనా గత కొంతకాలంగా ప్రకటిస్తోంది. విదేశాల నుంచి ప్రయాణికులు తీసుకొచ్చే ఆహార పదార్థాలతోనే వైరస్ వస్తున్నట్లు ఆరోపిస్తోంది. అయితే, చైనా తీరుపై ప్రపంచ దేశాల మండిపడుతున్నాయి.
కరోనావైరస్ చైనాలో వూహాన్లో పుట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రపంచానికి వ్యాపించింది. వైరస్ వ్యాప్తిని దాచడం వల్లే ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరించింది. చైనాలో కొంతమేర కరోనా తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ ఇటీవల కాలంలో విజృంభిస్తోంది.