భారత్కు అప్పగిస్తే నన్ను నేను చంపుకుంటా: నీరవ్ మోడీ బెదిరింపులు
యూకే: లండన్ జైల్లో ఉన్న భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఇక బెదిరింపు ధోరణికి దిగారు. నీరవ్ మోడీ బ్యాంకులకు టోకరా వేసి లండన్కు పారిపోవడంతో అక్కడి నుంచి భారత్కు రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ క్రమంలో కొన్ని దౌత్యపరమైన అంశాలు అడ్డుగా ఉండటంతో ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతోంది. ఇప్పటికే జైలులో ఉన్న నీరవ్ మోడీ, బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే యూకే కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేయడం లేదు. ఇక తాజాగా మరో బెయిల్ పిటిషన్ వెస్ట్మిన్స్టర్ కోర్టులో వేశారు. ఆ బెయిల్ పిటిషన్కు సంబంధించి వాదనలు ఉండగా తన లాయరుతో కోర్టుకు చేరుకున్నాడు నీరవ్ మోడీ. మొత్తంగా నీరవ్ మోడీ ఐదవ సారి బెయిల్ కోసం పిటిషన్ వేశాడు.
ఐదోసారి: నీరవ్ మోడీకి యూకే కోర్టులో చుక్కెదురు
పంజాబ్ నేషనల్ బ్యాంకు వద్ద తీసుకున్న రుణం రూ.9,100 కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయాడు నీరవ్ మోడీ. ఇక లండన్లో పోలీసులు అరెస్టు చేయగా అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. ఇక నీరవ్ మోడీ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ కీత్.... తన క్లయింట్ నీరవ్ మోడీని ఇతర ఖైదీలు రెండు సార్లు కొట్టారని చెప్పారు. వాండ్స్వర్త్ జైలులో ఈ ఏడాది ఏప్రిల్లో ఒకసారి తాజాగా మంగళవారం కూడా నీరవ్ మోడీని కొట్టారని చెప్పారు. ముంగళవారం రోజున ఉదయం 9 గంటలకు ఇద్దరు ఇతర ఖైదీలు నీరవ్ మోడీ ఉంటున్న సెల్లోకి ప్రవేశించి అతన్ని కొట్టి గాయపరిచారని చెప్పారు కీత్. ఇక జైలులో ఉన్న పోలీసులు నీరవ్ మోడీపై దాడి జరుగుతున్నప్పటికీ పట్టించుకోలేదని, లాయరును వెంటనే కలవాలని నీరవ్ అధికారులతో చెప్పగా వారు ఇందుకు నిరాకరించారని కీత్ చెప్పారు.
ఇక తనపై జరిగిన దాడికి సంబంధించిన రుజువులను కోర్టుకు నివేదించిన నీరవ్ మోడీ... తనను తిరిగి భారత్కు పంపిస్తే తనను తాను చంపుకుంటానని బెదిరింపులకు దిగాడు. అంతేకాదు భారత్లో తనకు సరైన న్యాయం జరగదని వెల్లడించాడు. ఇక నీరవ్ పై మళ్లీ దాడి జరిగే అవకాశం ఉన్నందున అతను ఉంటున్న జైలులో భద్రత పెంచాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు లాయర్. ఇక బెయిల్ మంజూరు చేస్తే బెయిల్ సెక్యూరిటీ కింద రెట్టింపు డబ్బులను తన క్లయింట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం 2 మిలియన్ పౌండ్లు అంటే రూ.18 కోట్లు ఉండగా దాన్ని 4 మిలియన్ పౌండ్లు అంటే రూ.36 కోట్లు కట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పాడు.
వాదనలు విన్న వెస్ట్మిన్స్టర్ కోర్టు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేస్తే నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని భావించిన చీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్నాట్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. డిసెంబర్ 4వ తేదీన నీరవ్ మోడీ మరోసారి కోర్టుకు హాజరవుతాడు.