బ్రెగ్జిట్ తర్వాత ఈయూకు మరో షాక్?, వలసలే కొంపముంచాయి
లండన్: బ్రెగ్జిట్ ఓటుతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోతోంది. అదే దారిలో స్వీడన్ కూడా స్వెగ్జిట్ (స్వీడన్ ఎగ్జిట్) నిర్ణయం వైపు అడుగేస్తున్నట్లుగా తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో ప్రయివేటు సంస్థలు నిర్వహించిన ఓటింగులో స్వీడిష్ ప్రజలు ఈయూ నుంచి వైదొలిగేందుకే మొగ్గుచూపారట.
ఇటీవలి వరకు స్వీడన్లో ఈయూ నుంచి వైదొలగాలన్న భావన లేదు. ఎప్పుడైతే ఆసియా దేశాల నుంచి శరణార్థుల రాక పెరిగిందో, అప్పి నుంచి వారిలో మార్పు చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈయూ నుంచి విడిపోతే తప్ప శరణార్థి సమస్యలను పరిష్కారం దొరకదనే అభిప్రాయానికి స్వీడిష్ వాసులు వచ్చారంట.
ఓ సంస్థ శుక్రవారం నాడు నిర్వహించిన సర్వేలో.. 36 శాతం మంది స్వీడిష్లు ఈయూ నుంచి వైదొలిగేందుకు మొగ్గు చూపారు. 32 శాతమే కలిసి ఉండేందుకు మొగ్గు చూపించారు. స్వీడన్తో పాటు పలు ఈయూ దేశాలు శరణార్థి సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి.
కాగా, ఈయూ కూటమి నుంచి బ్రిటన్ విడిపోవాలంటూ కొంతకాలంగా వాదనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ అంశంపై గురువారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. గ్రేట్ బ్రిటన్ అంటే.. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్త్ ఐర్లాండ్ సమూహం. వీటిలోని మొత్తం 382 కేంద్రాల్లో అభిప్రాయ సేకరణ జరిగింది.
పేద దేశాల వలసలే బ్రెడ్జిట్కు ముఖ్యమైన కారణమని చెబుతున్నారు. బ్రిటన్లో విద్య, నేషనల్ హెల్త్ స్కీం కింద వైద్య సేవలు ఉచితం కావు యూరప్కు చెందిన పేద దేశాల నుంచి గత రెండు మూడేళ్లుగా భారీగా వలసలు పెరిగాయి.
దీంతో ప్రధాని కామెరూన్ నిరుద్యోగ భృతి, పిల్ల పెంపక భృతిని తగ్గించారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కలిగింది. దానికి తోడు సిరియా నుంచి వలసలు పెరిగాయి. టర్కీలాంటి దేశాలను యూరోపియన్ యూనియన్లో చేర్చుకోవాలనే ప్రతిపాదన కూడా బ్రిటన్ వాసులకు ఆగ్రహం తెప్పించింది.