చైనా మరో సంచలనం: రాజ్నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - యుద్ధం వస్తే భారత్ ఓడుతుందంటూ..
కయ్యాలమారి చైనా మరోసారి సంచలన ప్రకటన చేసింది. యుద్ధ భాషలో భారత్ కు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. రక్షణ మంత్రుల సమావేశంలో శాంతికి అంగీకరించినట్లే నటించిన డ్రాగన్.. గంటల వ్యవధిలోనే రెండో నాలుకతో వెక్కిరింపులకు పాల్పడింది. ఇప్పుడు కొనసాగుతోన్న సరిహద్దు వివాదం గనుక యుద్ధంగా మారితే.. భారత్ ఓడిపోవడం తథ్యమంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ లో బెదిరింపులకు దిగింది.
Recommended Video
25 మంది కిడ్నాప్: పీకలు కోసేశారు - నలుగురి హతం - ఐదుగురి విడుదల - మావోయస్టుల ఘాతుకం
ఇండియా గెలవలేదు..
చైనా ఒక దేశంగానేకాదు, సైనిక పరంగానూ అత్యంత శక్తిమంతైనదన్న విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలని, చైనాతోపాటు ఇండియాను కూడా గొప్ప శక్తిగానే తాము భావిస్తున్నామని, అయితే, పోరాట పటిమ, సైనిక సామర్థ్యంలో అంతిమంగా చైనానే బలవంతురాలని, సరిహద్దులో ఇప్పుడు కొనసాగుతోన్న వివాదాలుగానీ యుద్ధంగా మారే పరిస్థితుల్లో ఇండియా గెలిచే అవకాశాలు లేనేలేవని గ్లోబల్ టైమ్స్ శనివారం నాటి ఎడిటోరియల్ లో పేర్కొంది. మాస్కో వేదికగా భారత్, చైనా రక్షణ మంత్రులు ముఖాముఖి చర్చలు జరిపిన కొద్ది గంటలకే చైనీస్ కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక ఈ మేరకు యుద్ధ హెచ్చరికలు చేయడం గమనార్హం.
ఆర్మీ కిడ్నాప్కు గురైంది..
‘‘సరిహద్దు వివాదాలకు సంబంధించి భారత ప్రజల్లో విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. నిజం చెప్పాలంటే ఇండియన్ ఆర్మీ జాతీయవాదం చేతిలో కిడ్నాప్ కు గురైంది. రాజకీయ, జాతీయవాద పోకడలకు అనుగుణంగా సైన్యం వ్యవహరిస్తున్నది. అందుకే సరిహద్దు వద్ద దూకుడు ప్రదర్శిస్తూ, చైనా భూభాగాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నది. సరిహద్దులో శాంతి నెలకొనాలన్న చైనా కోరికను బలహీనతగా భారత్ తప్పుగా అర్థం చేసుకుంటోంది. కాబట్టే యుద్ధానికి సిద్ధంగా ఉన్నమంటూ ప్రకటనలతో రెచ్చగొడుతున్నది'' అంటూ గ్లోబల్ టైమ్స్ భారత్ పై అక్కసు వెళ్లగక్కింది.
ఆపరేషన్ ఆడెళ్లు : గ్రేహౌండ్స్ ఉచ్చు! - అందుకే ఆదిలాబాద్లోనే డీజీపీ మకాం? - అడవిలో ఏం జరుగుతోంది??
ఆ మీటింగ్ కీలకం అంటూనే..
మాస్కో వేదికగా చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఘే, భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల మధ్య జరిగిన చర్యలు.. రెండు దేశాల సంబంధాల్లో కీలకమైన టర్నింగ్ పాయింట్ అని అభివర్ణించిన గ్లోబల్ టైమ్స్.. అదే నోటితో భారత్ కు యుద్ధ హెచ్చరిక చేయడం గమనార్హం. శుక్రవారం రాత్రి ఫెంఘేతో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన రాజ్ నాథ్.. సరిహద్దుల్లో చైనా చర్యలు ముమ్మాటికీ ఒప్పందాల ఉల్లంఘనే అని కుండబద్దలుకొట్టారు. శాంతిస్థాపనకు నమ్మకం అవసరమని, సౌర్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో భారత్ రాజీపడబోదని స్పష్టం చేశారు. చైనా మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని, ఇండియానే ఆక్రమణకు ప్రయత్నించిందని వితండవాదం చేసింది.
గ్రీన్ లైన్ పై చైనా గురి..
చుట్టూ 14 దేశాలతో సరిహద్దులు పంచుకునే చైనా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాల నుంచి అన్ని వైపులా కయ్యాలకు దిగుతూ.. 70 ఏళ్లలో మొత్తంగా లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించినట్లు రిపోర్టులు ఉన్నాయి. తూర్పు లదాక్ లోని పలు ప్రాంతాల్లోనూ చైనా ఆక్రమణలకు యత్నించగా, భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. లదాక్ తో టిబెట్ సరిహద్దును ‘‘గ్రీన్లైన్''గా పేర్కొనే చైనా.. మార్చిన మ్యాపులను చూపిస్తూ.. కొత్త కొత్త భూభాగాలను తనలో కలిపేసుకుంది. తొలి నుంచీ వివాదరహితంగా, రెండు దేశాల మధ్య చర్చలకు కేంద్రంగా ఉంటోన్న చుషూల్ ప్రాంతాన్ని సైతం తనదేనంటూ చైనా వాదనకు దిగడం గమనార్హం.