రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు..ఇక మాస్కుల్లేకుండా తిరగొచ్చు: జో బిడెన్
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి ప్రస్తుతం ప్రపంచం మొత్తం ముఖాలకు మాస్కలను వేసుకుని తిరుగుతోంది. వైరస్ బారిన పడకుండా ఉండటానికి మాస్క్ తప్పనిసరి చేశాయి అన్ని దేశాలు. భారత్ వంటి కొన్ని దేశాలు మాస్కులు లేకుండా తిరిగే వారికి జరిమానాలను కూడా విధిస్తోన్నాయి ఇలా ఎన్ని రోజులు మాస్కులు వేసుకుని తిరగాలో తెలియని పరిస్థితి చాలాచోట్ల నెలకొంది. మాస్కులు ధరించడం అనేది రోజువారీ జీవితంలో ఓ భాగమౌతుందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.
The CDC announced that they are no longer recommending that fully vaccinated people need to wear masks. pic.twitter.com/pFhJEtBepq
— Joe Biden (@JoeBiden) May 13, 2021
మాస్కుల్లేకుండా ప్రెస్మీట్కు
ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. కీలక ప్రకటన చేశారు. అమెరికా త్వరలోనే మాస్కుల రహిత దేశంగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరిగొచ్చని చెప్పారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్లోని రోజ్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాస్కులు ధరించకుండా హాజరయ్యారు. డబుల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇక ఎంతో కాలం మాస్కులు వేసుకుని తిరగబోరని ప్రకటించారు.
యుద్ధం చివరి దశకు..
అమెరికా చరిత్రలో ఇదో సుదినంగా బిడెన్ అభివర్ణించారు. కంటికి కనిపించని వైరస్పై అమెరికన్లు సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ వచ్చిన యుద్ధం.. అంతిమ దశకు చేరుకుందని పేర్కొన్నారు. అంతకుముందు- సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) కూడా ఇదే ప్రకటన చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు త్వరలోనే మాస్కులు లేకుండా తిరగడానికి అనుమతి ఇస్తామని తెలిపింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను తాము రూపొందిస్తోన్నామని స్పష్టం చేసింది.
ఇండోర్ ప్రాంతాల్లో మరి కొన్ని రోజుల పాటు..
మస్సాచుసెట్స్, న్యూయార్క్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, వర్జీనియాల్లో మాస్కులు లేకుండా తిరగడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయా రాష్ట్రాల గవర్నర్లు తెలిపారు. తమ రాష్ట్రాల్లోని ప్రజలు 80 శాతానికి పైగా రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నారని వారు పేర్కొన్నారు. ఆరుబయట మాస్కులను ధరించాల్సిన అవసరం లేనప్పటికీ.. ఆడిటోరియాలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి ఇండోర్ ప్రాంతాల్లో మాత్రం మరి కొన్ని రోజుల పాటు మాస్కులను ధరించాల్సి ఉంటుందని నార్త్ కరోలినా గవర్నర్ అధికార ప్రతినిధి రాయ్ కూపర్ పేర్కొన్నారు.
ముమ్మరంగా వ్యాక్సిన్.
కరోనా వైరస్ను నిర్మూలించడానికి అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి వంద రోజుల నాటికి 200 మిలియన్ల మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందక్కడి అధికార యంత్రాంగం. ఇప్పటికే 170 మిలియన్ల మంది వరకు వ్యాక్సిన్ వేశారు.ఫైజర్-బయోఎన్టెక్, మోడెర్నా వ్యాక్సిన్లను అక్కడ వినియోగిస్తోన్నారు. 12 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి యూఎస్ఎఫ్డీఏ ఇదివరకే అనుమతులు కూడా మంజూరు చేసింది. కరోనా బారిన పడి అమెరికాలో ఇఫ్పటిదాకా 5,98,540 మంది మరణించారు. 3,36,26,036 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Recommended Video