ఒక స్థాయి ఉండాలంటే భారత్లో పెట్టుబడులు పెట్టండి: అమెరికాలో మోడీ పిలుపు
న్యూయార్క్: ఒక స్థాయి ఉన్న మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మీరంతా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కంపెనీలకు పిలుపునిచ్చారు. బుధవారం న్యూయార్క్లో జరిగిన బ్లూమ్బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో నరేంద్ర మోడీ ప్రసంగించారు.
తమ ప్రభుత్వం ఇటీవలే కార్పొరేటర్ టాక్స్ తగ్గించిందని, ఇది పెట్టుబడిదారులకు ప్రోత్సాహాన్ని ఇస్తోందని నరేంద్ర మోడీ వివరించారు. వాస్తవికతలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇండియాకు రండి అని మోడీ ఆహ్వానం పలికారు.
మౌలిక సదుపాయాల కల్పనలో భారీగా పెట్టుబడులకు అవకాశాలున్నాయని ప్రధాని వివరించారు. గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థకు 1 ట్రిలియన్ అమెరికా డాలర్లను జతచేశామని చెప్పారు. ప్రస్తుతం వచ్చే ఐదేళ్లకు తమ ప్రభుత్వం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
డెమోక్రసీ, రాజకీయ స్థిరత్వం, అంచనా వేయగల విధానాలు, ఇండిపెండెంట్ జుడీషియరీ గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ లాంటి అంశాలు భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు సానుకూల అంశాలని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా కంపెనీలకు వివరించారు.
Addressing the #BloombergGBF. Watch. @business https://t.co/RdJKRn53oP
— Narendra Modi (@narendramodi) September 25, 2019
భారత్లోని నగరాలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా రక్షణ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించామని మోడీ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం 50 చట్టాలను రద్దు చేశామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో వ్యాపారాన్ని గౌరవించే, సంపదను సృష్టిని ప్రోత్సహించే ప్రభుత్వం ఉందని తెలిపారు.
అంతేగాక, భారతదేశం పన్నుల సంస్కరణలను కొనసాగిస్తూనే ఉంటుందని ప్రదాని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్) ఆకర్షించామని వివరించారు. గత 20ఏళ్లతో పోలిస్తే ఇది అందులో సగం ఉంటుందని చెప్పారు.
హోడీ మోడీ కార్యక్రమంతోపాటు ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గత శనివారం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. హోడీ మోడీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కాగా, ఈ రెండు కార్యక్రమాల్లోనూ నరేంద్ర మోడీతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత పలు కీలక సమావేశాల్లోనూ ఆయన పాల్గొంటున్నారు.