నవాజ్ షరీఫ్, కూతురు మరియంకు ఇస్లామాబాద్ కోర్టులో భారీ ఊరట
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు, ఆయన కూతురు మరియం షరీఫ్కు ఇస్లామాబాద్ హైకోర్టులో బుధవారం భారీ ఊరట లభించింది. వీరితో పాటు నవాజ్ షరీఫ్ అల్లుడు కెప్టెన్ సఫ్దర్కు కూడా కోర్టులో రిలీఫ్ లభించింది. వీరికి శిక్ష విధిస్తూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది.
అవినీతి కేసులో నవాజ్ షరీఫ్కు పదేళ్ల జైలు శిక్ష, కూతురుకు ఏడేళ్లు
ఈ ఏడాది జూలై ఆరో తేదీన అవినీతి కేసులో అకౌంటబులిటీ కోర్టు వారికి శిక్ష విధించిన విషయం తెలిసిందే. తమకు విధించిన శిక్షను వీరు ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇటీవల రిజర్వ్లో ఉంచింది. అనంతరం బుధవారం వారి శిక్షను సస్పెండ్ చేసింది. దీంతో వారు విడుదలయ్యే అవకాశముంది.
కాగా, నవాజ్ షరీఫ్కు పదేళ్ల జైలు శిక్ష, ఆయన కూతురు మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియంను నేషనల్ అకౌంటబులిటీ కోర్టు దోషులుగా తేల్చింది. అవెన్ఫీల్డ్ ప్రాపర్టీస్ కేసులో ఈ శిక్ష పడింది.
నవాజ్ షరీఫ్ అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ సఫ్దర్కు ఏడాది జైలు శిక్ష విధించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఈ తీర్పు వచ్చింది. షరీఫ్ పైన మొత్తం నాలుగు అవినీతి కేసులు ఉన్నాయి.