కరోనాదెబ్బకు అంధకారంలోకి అంసంఘటిత కార్మికుల జీవితాలు: ఐఎల్ఓ
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇక ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ మహమ్మారి వల్ల నష్టపోయిన కార్మికులు, కార్మికలోకం గురించి గుర్తుచేసుకోవాల్సిన సమయం వచ్చింది. కరోనావైరస్ మహమ్మారితో 1.6 బిలియన్ అసంఘటిత కార్మికుల బతుకులు ప్రశ్నార్థకంగా మారబోతున్నాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల్లో వీరి సంఖ్య సగానికి పైగా ఉంది. ఇక ఈ ఏడాది రెండో సగంలో మొత్తం పనిగంటలు కూడా 10.5శాతం తక్కువగా ఉంటాయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఇది ఎక్కువగా అమెరికా యూరోప్ మరియు మధ్యాసియా దేశాల్లో కనిపిస్తుందని చెప్పారు.
ఒకవేళ పనివేళలు తగ్గితే అందరికీ అదే అమలయ్యేలా చూడాలనే డిమాండ్ ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని ఐఎల్ఓ ఏప్రిల్ 7న విడుదల చేసిన ఒక ప్రకటనలో అంచనా వేసింది. ఇదే జరిగితే దాదాపు 436 మిలియన్ వాణిజ్య సంస్థలు, వ్యాణిజ్యం, స్వయం ఉపాధి కలిగిఉన్న వారిపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు బిలియన్ల అసంఘటిత కార్మికులకు రోజువారీ సంపాదన తగ్గిపోయిందని ఐఎల్ఓ వెల్లడించింది. అసంఘటిత కార్మికులు చాలా అన్యాయంకు గురవుతున్నారని అభిప్రాయపడింది. వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని, మంచి ఆరోగ్య సదుపాయం లేదని అభిప్రాయపడింది.
కొన్ని మిలియన్ మంది ప్రజలకు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి నెలకొందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. వారికి భద్రత లేదని ప్రస్తుత పరిస్థితితో భవిష్యత్తు కూడా అంధకారంలోకి నెట్టివేయబడిందని వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్యరంగం కుదేలైందన్న విషయాన్ని గుర్తు చేసిన ఐఎల్ఓ ఇప్పుడు అసంఘటిత కార్మికులకు ప్రభుత్వాలు సహాయం చేయకపోతే వారి బతుకులు అంధకారంలోకి నెట్టివేయబడుతాయని పేర్కొంది. ఈ సమయంలో వారికి సేవింగ్స్ ఉండవని గుర్తుచేసింది. ఇక కరోనావైరస్ దెబ్బకు లాక్డౌన్లోకి ఆయా దేశాలు వెళ్లిపోవడంతో ఉత్పత్తి రంగం, ఆహార రంగం, హోల్ సేల్ మరియు రీటైల్ వాణిజ్యం, రియల్ ఎస్టేట్ రంగాలు పూర్తిగా నష్టపోయాయని ఐఎల్ఓ పేర్కొంది.
ఇక ఉద్యోగాల విషయానికి వస్తే 2020 ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుందనే దానిపై ఆధారపడి ఉంటాయని ఐఎల్ఓ వెల్లడించింది. అంతేకాదు విధానపరమైన చర్యలను ఆయా ప్రభుత్వాలు ఏమేరకు తీసుకొంటాయనే దానిపై ఆధారపడి ఉంటాయి.