చైనాకు మిత్ర దేశం షాక్: పాకిస్థాన్లోనూ టిక్టాక్పై నిషేధం, ఎందుకంటే?!
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా యువతలో ఎంతో క్రేజ్ సంపాదిచుకున్న చైనాకు చెందిన వినోదపు యాప్ టిక్టాక్కు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే భారతదేశంలో ఈ యాప్ను నిషేధించిన విషయం తెలిసిందే. అమెరికా కూడా నిషేధం విధించేందుకు సిద్ధమైనప్పటికీ తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఈ నేపథ్యంలో చైనాకు మిత్ర దేశమైన పాకిస్థాన్ కూడా టిక్టాక్కు షాకిచ్చింది. టిక్టాక్పై నిషేధం విధిస్తూ పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్లోని అనైతిక, అసభ్యకరమైన సమాచారానికి వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పీటీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది.
చట్ట విరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ను నియంత్రించేందుకు సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సమయం ఇచ్చినప్పటికీ.. టిక్టాక్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిషేధం విధించాలని నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
టిక్టాక్ యాప్లో అభ్యంతరకరమైన డేటాను తొలగించాలని ఆదేశిస్తూ జులై చివరిలోనే హెచ్చరించినా ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని చెప్పారు. కాగా, యాప్ నిషేధంపై టిక్టాక్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. పాకిస్థాన్ దేశంలో ఈ యాప్ ను 39 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. తాజా నిర్ణయంపై టిక్టాక్ స్పందించిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని పీటీఏ పేర్కొంది.