వావ్! నరేంద్ర మోడీ: ఆకట్టుకుందని బిల్గేట్స్ ప్రశంసలు
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ నిబద్ధత ఆకట్టుకున్నదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కొనియాడారు. భారత్లో ఆరోగ్య సేవలను విస్తృతంగా చేయాలని, మారుమూల ప్రాంతాలను కూడా పూర్తిస్థ్యీలో మరుగుదొడ్లు నిర్మించాలని, పేదరికం నిర్మూలించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిబద్ధతతో చేస్తున్న పోరాటం తనను ఆకట్టుకుందని బిల్ గేట్స్ అన్నారు.
అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం పైన మోడీ శ్రద్ధ పెట్టడం అభినందనీయమన్నారు. తాను భారత్ వచ్చినప్పుడు తమ మధ్య చర్చ ఎక్కువగా పేదల గురించి, వారి ఆరోగ్యస్థితి, వ్యాక్సిన్లు, హెల్త్ సెంటర్లు, బ్యాంకు ఖాతాల గురించే జరిగిందన్నారు.
భారత్లో పేదరిక నిర్మూలన, వారి ఆరోగ్యస్థితిని మెరుగుపర్చడం పట్ల మోడీ నిబద్ధత ఎంతగానో ఆకట్టుకుందన్నారు. తాను భారత్ వచ్చినప్పుడు తామిద్దరం అరగంటకు పైగా మాట్లాడుకున్నామని తెలిపారు. అది చాలా మంచి సమయమని, కేవలం భారత్కే కాదని, పేదలకు వైద్యం, ఆరోగ్యం విషయంలో అందరు తమ వంతు కృషి చేయాలన్నారు.
ప్రపంచంలో చాలామందికి మరుగుదొడ్లు లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. పీఎంవో కార్యాలయం బిజీగా ఉన్నప్పటికీ, జమ్ము కాశ్మీర్ వరదలు ఉన్నప్పటికీ.. ఆ సమయంలో వాటిని చూసుకుంటూనే తమతో భేటీ కావడంపై మోడీని బిల్ గేట్స్ అభినందించారు.
తన కేబినెట్లోని మంత్రులకు వంద రోజుల్లో ఏం చేస్తారని అడగటంతో పాటు, వారికి లక్ష్య్లాలు నిర్ధేశించడం గొప్ప విషయమన్నారు. కాగా, గత నెల బిల్ గేట్స్, ఆయన సతీమణి భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. గేట్స్ తన బ్లాగ్లో మీటింగ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ అనే వ్యాసంలో పైవిధంగా పేర్కొన్నారు.