పాకిస్తాన్ లో సామాన్యుల కడుపునింపిన ప్రధాని..! ఇమ్రాన్ జోక్యంతో నాన్, రోటీ ధరల్లో తగ్గుదల..!!
ఇస్లామాబాద్/హైదరాబాద్ : అన్న దాతా సుఖీభవ. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అందుతున్న ప్రశంసలు ఇవి. సామాన్యుడి కడుపునిండే ఆహార పదార్థాలపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి దృష్టి సారించారు. ఆకాశాన్నంటుతున్న తినుబండారాల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. పాకిస్తాన్ లో సామాన్య ప్రజానికం ఎక్కువగా ఇష్టపడే రోటీ, నాన్, బ్రెడ్ వంటి ధరలు గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటుతున్నాయి.
ఈ ధరలను నియంత్రించాలని చాలా సార్లు ఆందోళనలు జరిగినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. విషయం కాస్త ప్రదాని కార్యాలయానికి చేరడంతో ఇమ్రాన్ ఖాన్ ఇదే అంశం పట్ల ఆరా తీసినట్టు తెలుస్తోంది. సామాన్యుల ఆకలి తీర్చే రోటీ, నాన్ ధరలు దగ్గించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హుకుం జారీ చేయడంతో యజమానులు దిగొచ్చనట్టు సమాచారం.
పాకిస్థాన్లో సాధారణ ఆహార పదార్థాల ధరలు పెరుగుతుండటంతో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాల మేరకు నాన్, రోటీ ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం జరిగిన ఫెడరల్ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో సామాన్య ప్రజానీకానికి గొప్ప ఊరట లభించింది. ప్రధాన మంత్రికి ప్రత్యేక సహాయకుడు డాక్టర్ ఫిరదౌస్ అషిఖ్ అవన్ మాట్లాడుతూ నాన్, రోటీ ధరలు పెరుగుతుండటాన్ని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా పరిగణించారని తెలిపారు. అంతకుముందు ఉన్న ధరలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారన్నారు.
ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా నాన్, రోటీ ధరలు తగ్గినట్లు చెప్పారు. గ్యాస్ ధరలపై కూడా ఇమ్రాన్ చర్యలు తీసుకున్నారన్నారు. నాన్ ధర 8 రూపాయల నుంచి 10 రూపాయల మధ్యలో ఉండేది, గ్యాస్, గోధుమ పిండి ధరలు పెరగడంతో నాన్ ధర 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెరిగింది. రోటీ ధర 7 రూపాయల నుంచి 8 రూపాయల మధ్యలో ఉండేది, దీని ధర 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు పెరిగింది. ఇమ్రాన్ ఆదేశాలతో అంతకుముందు ధరలకే ప్రస్తుతం నాన్, రోటీ లభిస్తున్నాయని అవన్ తెలిపారు.