రాబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండండి: ఇమ్రాన్ ఖాన్
భారత సరిహద్దు దాటి పాకిస్తాన్ గగనతలంలోకి చొచ్చుకుపోయి అక్కడి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత వాయుసేనను ప్రపంచం దేశాలు అభినందిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పాక్ పై భారత దాడిని బాలీవుడ్తో పోల్చుతూ ట్వీట్ చేసింది. దాడులను భారత మీడియా హైప్ చేసి చూపిస్తోందని లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చిత్రీకరిస్తోందని ఆపార్టీ మండిపడింది. అసలు ఎలాంటి ప్రాణహాని జరగలేదని పాక్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చాక కూడా భారత మీడియా సర్జికల్ స్ట్రైక్ 2 పేరుతో నానా యాగీ చేస్తోందని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మండిపడుతూ ట్వీట్ చేసింది.
భారత మీడియా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తుందని తమకు ఇప్పుడు కాదు ఎప్పటినుంచో తెలుసని... ఆ మీడియాను భారత రక్షణశాఖ పిలిపించి నియంత్రించాలని ట్వీట్ చేసింది. భారత వైమానిక దళం పాక్ గగనతలంలోకి వచ్చినట్లు తెలియగానే పాక్ ఎయిర్ఫోర్స్ స్పందించడంతో భారత యుద్ధ విమానాలు తిరిగి వెళ్లిపోయాయని ఆ పార్టీ ట్వీట్ చేసింది. భారత యుద్ధవిమానాలు బాంబు దాడులు నిర్వహించాయని ఇప్పటికి కూడా పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఒప్పుకోవడం లేదు.
ఇది భారత్కు ఎన్నికల సంవత్సరం కాబట్టి పాకిస్తాన్పై దాడులు చేసినట్లు అబద్ధాలు చెబుతోందని భారత యుద్ధ విమానాలను పసిగట్టగానే పాకిస్తాన్ ఆర్మీ వాటిని తిప్పి కొట్టిందని మరోచోట ఇంధనంను డంప్ చేయడంతో ఇదే బాంబు దాడులని భ్రమించి భారత్ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందని తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ ట్వీట్ చేసింది.
Prime Minister Imran Khan has summoned special meeting of NCA on 27 Feb 2019. PM has directed that elements of national power including the Armed Forces and the people of Pakistan to remain prepared for all eventualities.
— PTI (@PTIofficial) February 26, 2019
ఇక భారత్ యుద్ధవిమానాలు పాక్ గగనతలంలోకి చొచ్చుకురావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అత్యవసర సమావేశం నిర్వహించి తమ జాతీయ భద్రత కమిటీతో సమావేశంతో చర్చించారు. పాకిస్తాన్ పై దాడి చేసినట్లు చెప్పుకుంటున్న భారత్పై త్వరలోనే ప్రతీకార చర్యలకు దిగుతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. మరోవైపు జరగబోయే పరిణామాలన్నిటికీ సిద్ధంగా ఉండాలంటూ పాక్ ఆర్మీకి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. సరైన సమయం చూసుకుని భారత్ పై దాడి చేయాలంటూ వారిని అప్రమత్తం చేశారు.