ఓ వైపు సరిహద్దుల్లో రక్తపాతం, మరోవైపు శాంతిచర్చలు: తిరస్కరించిన భారత్పై ఇమ్రాన్ అక్కసు
ఇస్లామాబాద్: ఓ వైపు సరిహద్దుల్లో సైన్యాన్ని చంపుతూ, మరోవైపు చర్చలకు పాకిస్తాన్ పిలవడాన్ని భారత్ తిప్పికొట్టింది. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని చర్చలకు సిద్ధమని ప్రకటించగా, తొలుత భారత్ సిద్ధపడింది. కానీ ఆ తర్వాత చర్చలకు విముఖత చూపింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తద్వారా భారత్ పైన తన అక్కసు వెళ్లగక్కాడు.
అతను వివాదాస్పద ట్వీట్ చేశారు. భారత్ తీసుకున్న నిర్ణయం దురహంకారంగా, ప్రతికూలంగా ఉందన్నారు. శాంతి కోసం చర్చలు జరపడానికి తాను ఇచ్చిన పిలుపునకు భారత్ దురహంకారంగా, ప్రతికూలంగా ఇచ్చిన సమాధానం నిరాశపరిచిందని, గొప్ప స్థానంలో కూర్చొని గొప్ప లక్ష్యాలు లేకుండా పని చేసేవారిని తన జీవితంలో చాలా మందిని చూశానని ఆయన ట్వీట్ చేశారు.
అంతకుముందు, ఇరుదేశాల మధ్య చర్చలు జరిపేందుకు అంగీకరించిన భారత్, మళ్లీ దానిని రద్దు చేయడం పట్ల తమ దేశం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తోందని పాకిస్థాన్ ప్రకటించింది.
కాగా, అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇరు దేశాల మధ్య చర్చలు జరుపుదామని ప్రధాని మోడీకి ఇమ్రాన్ లేఖ రాశారు.
అయితే, ఇటీవల జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో భారత బీఎస్ఎఫ్ జవాన్ను పాకిస్థాన్ రేంజర్లు గొంతుకోసి చంపారు. అనంతరం జమ్ము కాశ్మీర్లో ఇళ్ల నుంచి ముగ్గురు పోలీసులను అపహరించిన ఉగ్రవాదులు కిరాతకంగా హత్య చేశారు. దీంతో ఓ వైపు రక్తపాతం జరుపుతుంటే మరోవైపు చర్చలు ఎలా జరుపుతామని భారత్ పాకిస్తాన్ అభ్యర్థనను తిరస్కరించింది.