షరీఫ్పై యుద్ధం: ఇమ్రాన్కు షాకిచ్చిన మాజీ భార్య రెహామ్
లాహోర్: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పైన నవంబర్ 2న యుద్ధానికి సన్నద్ధమవుతున్న తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్కు ఆయన మాజీ భార్య రెహామ్ ఖాన్ గట్టి ఝలక్ ఇచ్చింది. తాను పెళ్లి రోజున బహుమతి అడిగితే, విడాకులు ఇచ్చాడని ఆరోపించింది.
ఇమ్రాన్ ఖాన్ను ఎందుకు ఇష్టపడ్డానంటే: రెహామ్ ఖాన్
పెళ్లి రోజు బహుమతిగా ఏమిస్తారని గత ఏడాది అక్టోబర్ 31న తాను అడిగానని, చివరకు తనకు విడాకులు ఇచ్చారని రెహామ్ ఖాన్ అన్నది. ఆమె ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడారు. కాగా, టెలివిజన్ జర్నలిస్టు అయిన రెహామ్, ఇమ్రాన్ ఖాన్ల వైవాహిక బంధం పది నెలల పాటు మాత్రమే కొనసాగిన విషయం తెలిసిందే. నవంబర్ 2వ తేదీన ఇస్లామాబాద్ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రెహాం తెరపైకి రావడం గమనార్హం.
మోడీ చెప్పిందే పాక్లో అమలవుతోంది: ఇమ్రాన్
ఇమ్రాన్ ఖాన్ ధాని నవాజ్ షరీఫ్ పైన విరుచుకుపడుతున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభీష్టానికి అనుగుణంగా పాకిస్తాన్లో షరీఫ్ నడుచుకుంటున్నారన్నారు. మోడీ అజెండా పాక్లో అమలవుతోందన్నారు. మోడీ అజెండా మేరకే పాకిస్థాన్ సైన్యం ప్రాభవాన్ని తగ్గించేందుకు షరీఫ్ యత్నిస్తున్నారన్నారు. గతంలో శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లినప్పుడు తన తల్లి, బిడ్డలకు కాకుండా నరేంద్ర మోడీకి మొదటి ఫోన్ చేశారని షరీఫ్ పైన మండిపడ్డారు.
నవాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా తుది పోరాటానికి సిద్ధమవ్వాలని తమ కార్యకర్తలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. నవంబరు 2న ఇస్లామాబాద్లో భారీ నిరసన ప్రదర్శనకు తరలిరావాలన్నారు.
కాగా, పంజాబ్ ప్రావిన్సులోని వివిధ ప్రాంతాల్లో వందలాది పీటీఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ మద్దతుదారులను అడ్డుకునేందుకు పెషావర్-ఇస్లామాబాద్ మార్గాన్ని మూసివేశారు. అయితే కార్యకర్తలుగా గుంపులుగా, రహస్యదారుల ద్వారా ఇస్లామాబాద్కు తరలిరావాలని ఇమ్రాన్ సూచించారు.
ప్రస్తుతం పాక్లో నవాజ్ షరీఫ్ నియంతృత్వం సాగుతోందని, ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో నవంబరు 2న చూపిస్తామన్నారు. ఇటీవల పనామా పత్రాల్లో నవాజ్ షరీఫ్ అక్రమాస్థులు ఉన్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించి నవాజ్ విచారణ ఎదుర్కోవాలని లేదా పదవికి రాజీనామా చేయాలని ఇమ్రాన్ డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ను ఇస్లామాబాద్లోని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.