భారత్ సహనాన్ని పరీక్షిస్తున్న పాక్..? కశ్మీర్ కోసం అవసరమైతే భారత్పై అణుయుద్ధం చేస్తాం: ఇమ్రాన్ఖాన్
ఇస్లామాబాదు: కశ్మీర్ కోసం అవసరమైతే భారత్తో అణుయుద్ధం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తమ దేశంను ఉద్దేశించి ఇమ్రాన్ఖాన్ ప్రసంగించారు. కశ్మీర్పై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇమ్రాన్ఖాన్ త్వరలో ఒక విధానం ప్రకటిస్తామని చెప్పారు. పాకిస్తాన్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందుగా శాంతిని కోరుకున్నట్లు చెప్పిన ఇమ్రాన్ఖాన్... ఆ తర్వాత ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలనుకున్నట్లు చెప్పారు. భారత్లో కూడా ఇదే తరహా ఇబ్బందులున్నాయని చెప్పిన ఇమ్రాన్ఖాన్... వాతావరణంలోని మార్పులు రెండు దేశాలపై ప్రభావం చూపుతోందని అన్నారు. ఈ క్రమంలోనే తమ పొరుగుదేశాలతో స్నేహం కోరుకుంటున్నామని చెప్పారు.
ఉగ్రవాదం పేరుతో భారత్ కుంటి సాకులు చెప్పింది
ఇక కశ్మీర్పై మాట్లాడుతూ ఈ వివాదానికి తెరదించేందుకు భారత్ ఒక అడుగు ముందుకు వేస్తే తాము రెండడుగులు ముందుకు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇమ్రాన్ఖాన్ చెప్పారు. కేవలం చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. కశ్మీర్ అంశంపై మాట్లాడుదామని తాము భావించినప్పుడల్లా... ఉగ్రవాదం పేరుతో భారత్ కుంటిసాకులు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లో ఎన్నికలు వచ్చిన వేళ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని దీంతో తామే ఓ అడుగు వెనక్కు తగ్గినట్లు ఖాన్ చెప్పారు.
పాక్ను భారత్ అన్ని విధాలా ఇబ్బందులు పెట్టింది
ఇక పుల్వామా దాడులను ప్రస్తావించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... ఆ పాపమంతా పాకిస్తాన్దే అన్నట్లుగా భారత్ ప్రచారం చేసిందని మండిపడ్డారు. పుల్వామా దాడులు పాక్ చేయించిందని చేసిన ఆరోపణలపై రుజువులు ఉంటే ఇవ్వమని అడిగామని నిజంగానే పాక్ హస్తం ఉండి ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసినట్లు ఇమ్రాన్ఖాన్ తెలిపారు. ఇక భారత్లో ఎన్నికలు వచ్చాయని దీంతో తాము కూడా సైలెంట్ అయిపోయినట్లు చెప్పారు. అయితే తిరిగి అధికారం చేపట్టిన మోడీ సర్కార్... పాకిస్తాన్కు ఎలాంటి ఆర్థిక సహాయసహకారాలు అందకుండా భారత్ ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ తర్వాత ఆగష్టు 5వ తేదీన జమ్మూ కశ్మీర్పై నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్.
కశ్మీర్ విషయంలో మోడీ చారిత్రాత్మక తప్పు చేశారు
కశ్మీర్ అంశంలో ప్రధాని మోడీ చారిత్రాత్మక తప్పిదం చేశారని మండిపడ్డారు ఇమ్రాన్ ఖాన్. ఇక మోడీ సర్కార్ చేసిన తప్పుతో కశ్మీరీలకు స్వంతంత్రం రాబోతోందని చెప్పారు. మోడీ ఏకపక్ష ధోరణి, అహంకారం ఈ దెబ్బతో దిగిపోతాయని చెప్పారు. మరోవైపు కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లడంలో విజయం సాధించినట్లు పేర్కొన్నారు ఇమ్రాన్ఖాన్. ప్రపంచదేశాల అధినేతలు, దౌత్యాధికారుల దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. 1965 తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్యసమితి కశ్మీర్పై సమావేశం ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. అంతేకాదు అంతర్జాతీయ మీడియా కూడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోందని చెప్పారు. సెప్టెంబర్ 27న జరిగే యూఎన్ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తానని చెప్పారు ఇమ్రాన్ఖాన్.