మోడీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా: పాక్ ప్రధాని! అసలు కారణం?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ నరేంద్రమోడీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం భారత్ లో మోడీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటోంది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నియంత్రించడానికి మోడీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. శాంతి చర్చలకు భంగం వాటిల్లకుండా ఉండాలంటే భారత్ లో మోడీ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
మీటూ ఉద్యమం: కేంద్ర మాజీమంత్రి ఎంజే అక్బర్ కు ఎదురుదెబ్బ
మోడీ గెలిస్తే.. శాంతి చర్చలు కొలిక్కి
బుధవారం ఆయన ఇస్లామాబాద్ లో విదేశీ జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సంధించిన అనేక ప్రశ్నలకు సమాధనాలు ఇచ్చారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో సార్వత్రిక ఎన్నికల గురించి కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ప్రస్తుతం భారత్ తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని, వాటిల్లో విఘాతం కలగకుండా ఉండటానికి ఆ దేశంలో మరోసారి మోడీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మోడీ అధికారంలోకి రాకపోతే.. సమీప భవిష్యత్తులో భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా కొన్ని సైనిక చర్యలను తీసుకోవడానికి చాలావరకు అవకాశాలు ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పుల్వామా ఘటన తరువాత మోడీ ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు-మూడు వారాల వ్యవధిలో భారత్ తమ దేశంపై ఏదైనా ఒక సైనిక చర్యకు దిగుతుందని ఇమ్రాన్ ఖాన్ అంచనా వేశారు.
బీజేపీ పాలనలో భారతీయ ముస్లింలు స్వేచ్ఛగా..
కాశ్మీర్ అంశం మీద భారత్ తో శాంతి చర్చలను కొనసాగించడంలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చని తాను అభిప్రాయపడుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. మోడీ అధికారంలోకి వస్తే.. శాంతి చర్చలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఓ కొలిక్కి వస్తాయని అన్నారు. భారత్ లో మోడీ అధికారంలోకి రావడం వల్ల జమ్మూ కాశ్మీర్ సహా భారత్ లో నివసిస్తోన్న ముస్లింలు అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉందని తాను అనుకోవట్లేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. దశాబ్దాల కాలం నుంచీ ముస్లింలు భారత్ లో సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు. అతివాద హిందువుల వల్ల ముస్లింలకు ఎలాంటి ముప్పూ ఉండదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో మోడీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తలపిస్తున్నారని అన్నారు.
రాజకీయ అంశాలతో ముడిపడిన కాశ్మీర్..
తమ దేశంలోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నేలమట్టం చేయడానికి ఇప్పటికే తాము అనేక చర్యలు తీసుకున్నామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ విషయంలో తాము సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులు, కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కూడా తాము ఉపేక్షించబోమని అన్నారు. కాశ్మీర్ సమస్య భారత రాజకీయాలతో ముడిపడి ఉన్నదని, దాన్ని ఆయుధాల ద్వారానో, యుద్ధాల ద్వారానో పరిష్కరించుకోలేమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సరిహద్దు ఉగ్రవాదం వల్ల కాశ్మీరీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే విషయం తన దృష్టికి కూడా వచ్చిందని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద చోటు చేసుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాదుల దాడి ఘటనలో తమ ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ వార్తలు రావడం సరికాదని, ఆ ఘటనను తమకు ముడిపెట్టడం సహేతుకం కాదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.