పాక్ 22వ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణం: నవజ్యోత్ సింగ్ సిద్దు ప్రత్యేక కానుక, అధ్యక్షుడి పక్కనే సీటు
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ శనివారం పాకిస్థాన్ 22వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిద్ధూ తన స్నేహితుడు ఇమ్రాన్కు శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక కానుక అందించారు. సిద్ధూతో పాటు మాజీ క్రికెటర్లు కపిల్దేవ్, సునీల్ గావస్కర్కు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానాలు పంపారు.
సిద్ధూ మాత్రమే మొదటి నుంచి తాను ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే, శుక్రవారం సిద్ధూ పాక్ చేరుకున్నాడు.
తన స్నేహితుడికి సిద్ధూ కాశ్మీరీ శాలువాను కానుకగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పాక్ మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, వసీం అక్రమ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, ప్రమాణస్వీకారోత్సవంలో పాక్ అధ్యక్షుడి పక్కనే మొదటి వరుసలో నవజ్యోత్ సింగ్ సిద్ధు కూడా కూర్చోవడం గమనార్హం.