ఎందుకలాగా : నియమించిన 8 నెలలకే ఐఎస్ఐ చీఫ్ను తొలగించిన పాక్ ఆర్మీ
పాకిస్తాన్ మిలటరీ తన నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ ) డైరెక్టర్ లెఫ్ట్నెంట్ జనరల్ అసీం మునీర్ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మునీర్ అసీంను తొలగిస్తూ ఆయన్ను పాకిస్తాన్లో రెండో అతిపెద్ద ప్రావిన్స్ అయిన పంజాబ్ కమాండర్గా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ రాష్ట్రంలో సిక్కులు అత్యధికంగా ఉంటారు. అయితే డైరెక్టర్గా నియమితులైన 8నెలల సమయంలోనే అతన్ని ఎందుకు తొలగిస్తున్నామో అనేదానిపై మాత్రం వివరణ ఇవ్వలేదు. గతేడాది అక్టోబర్లో జనరల్ అసీం మునీర్ బాధ్యతలు చేపట్టారు.
ఇక జనరల్ మునీర్ స్థానంలో జనరల్ ఫయీజ్ హమీద్ను కొత్త ఐఎస్ఐ డైరెక్టర్గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది పాక్ మిలటరీ. హమీద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ డైరెక్టొరేట్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో ఐఎస్ఐ చీఫ్గా జనరల్ మునీర్ను ప్రమోట్ చేసిన సమయంలో జనరల్ హమీద్కు త్రీస్టార్ జనరల్ హోదా ఇస్తూ ప్రమోట్ చేయడం జరిగింది. ఇక హమీద్ను ఈ ఏడాది ఏప్రిల్లో మేజర్ జనరల్ నుంచి లెఫ్ట్నెంట్ జనరల్కు ప్రమోట్ చేశారు. ఐఎస్ఐలో జనరల్ హమీద్ అంచలంచెలుగా ఎదిగి డైరెక్టర్ స్థానానికి ఎదిగారు.
జనరల్ ఫయీజ్ హమీద్ ఐఎస్ఐలో బాధ్యతలు నిర్వర్తించినప్పుడు చాలామంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. ఇక పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు అహ్మదీయ సామాజిక వర్గం మధ్య మధ్యవర్తిత్వం వహించి 2017లో వెలుగులోకి వచ్చారు. పంజాబ్ రాష్ట్రంలో అహ్మదీయ సామాజిక వర్గం వారు తమను అధికారులు చిన్న చూపు చూస్తున్నారని పేర్కొంటూ రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో అహ్మదీయులు తమ ఆందోళనలు విరమించుకోక పోతే ఆర్మీని రంగంలోకి దించి ఆందోళనలను అణిచివేస్తామని బెదిరించారు. ఇలాంటి చర్యలతో హమీద్ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీపై దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని పాక్ ప్రభుత్వం అలర్ట్ చేసింది. కశ్మీర్లో దాడులకు తెగబడేందుకు ఆల్ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రయత్నిస్తోందని హెచ్చరించింది. ఈ హెచ్చరికలను ఐఎస్ఐ ద్వారా వచ్చినట్లు సమాచారం. కశ్మీర్లో భారీ ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందంటూ ఐఎస్ఐ భారత ప్రభుత్వానికి సందేశం పంపింది.అది కూడా పుల్వామాలోనే జరిగే అవకాశాలు ఉన్నట్లు ఐఎస్ఐ పేర్కొది. అయితే పాకిస్తాన్ ఈ సమాచారం ఇవ్వడంతో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలకు బీజం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక సమాచారం అందుకోవడంతో దక్షిణ కశ్మీర్లో 500 కంపెనీల అదనపు బలగాలను రంగంలోకి దించినట్లు భారత ఆర్మీ తెలిపింది.