హౌడీ..మోదీ సభలో స్టాండింగ్ ఒవేషన్ : భారత పార్లమెంట్ కు సైతం..!!
ప్రధాని మోదీ హ్యూస్టన్ సభలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా అధినేత ట్రంప్..ప్రధాని మోదీ కలిసి ప్రవాస భారతీయుల సమావేశంలో పాల్గొనటం ద్వారా...ఎటువంటి సంకేతాలు ఇస్తారనే ఉత్కంఠ దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా కనిపించింది. వేదిక మీదకు రావటం దగ్గర నుండి ప్రసంగాలు ముగిసి కార్యక్రమం చివర్లో ట్రంప్..మోదీ ఇద్దరూ కలిసి సభకు హాజరైన వారి వద్దకు వెళ్లారు. ట్రంప్ కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన సమక్షంలోనే కోరిన మోదీ.. ట్రంప్ ఉగ్రవాదం మీద చేసిన వ్యాఖ్యల సమయంలో తనతో సహా ప్రవాస భారతీయులతో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇక..మోదీ తన ప్రసంగంలో జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు గురించి వివరిస్తూ.. ఏకగ్రీవంగా ఆమోదించిన భారత పార్లమెంట్ కు సైతం ప్రధాని సూచన మేరకు ప్రవాస భారతీయులు స్టాండ్ ఒవేషన్ ఇచ్చి అభినందనలు తెలిపారు. దీని ద్వారా మోదీ రాజకీయంగా ఈ అంశంతో ఏ రకమైన మైలేజ్ సాధించారో..ఇంకా సాధించాలని ఆశిస్తున్నారో స్పష్టం అవుతోంది.
ట్రంప్ కు స్టాండింగ్ ఒవేషన్..
అమెరికా హ్యూస్టన్ హౌడీ-మోదీ సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న ట్రంప్ ఉక్కు సంకల్పానికి మద్దతుగా సభకు హాజరైనవారంతా ఒక్కసారిగా నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు సభకు హాజరైన ప్రవాస భారతీయులంతా నిలబడి తమ కరతాల ధ్వనులతో మద్దతు ప్రకటించారు. ట్రంప్ తన ప్రసంగంలో భాతర్..అమెరికా రెండు దేశాల ఉగ్రవాదం విషయంలో కఠినంగానే వ్యవహరిస్తాయని స్పష్టం చేసారు.
ఉగ్రవాద నిర్మూలనకు పూర్తిగా అండగా నిలుస్తామని ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాలు తమ సరిహద్దుల విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తాయని తేల్చి చెప్పారు. అమెరికా గ్రోత్ లో భారతీయుల పాత్ర అద్బుతమన్నారు. తమ దేశంలో ఉంటూ చట్టాలను గౌరవిస్తూ..పన్నులు కట్టే ఇతర దేశస్థులకు ఎటువంటి ఇబ్బంది లేదని..అమెరికాలో నివసించే ప్రతీ ఒక్కరి భద్రతకు బాధ్యత తీసుకుంటున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. అదే విధంగా అక్రమంగా తమ దేశంలో ఉన్న వారి విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని ట్రంప్ హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో మోదీ సాధించిన విజయాన్ని ట్రంప్ ప్రశంసించారు. తొలి సారి సాధించిన విజయం కంటే పెద్ద మెజార్టీతో మోదీ అధికారంలోకి వచ్చారని.. పేదరికం.. భద్రత.. ఆర్ధిక రంగాల్లో మోదీ ప్రయత్నాలను ట్రంప్ అభినందించారు.
370 రద్దు పై పార్లమెంట్ కు సైతం...
హౌడీ..మోదీ కార్యక్రమం పైన మోదీ స్పందిస్తూ దేశంలో అంతా బాగుందని చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం సాధించిన విజయాల పైన సుదీర్ఘంగా ప్రసంగించిన మోదీ గతంలో అమెరికా..భారత్ పైన జరిగిన ఉగ్ర దాడుల గురించి ప్రస్తావించారు. భారత్ను అస్థిరం చేసేందుకు పొరుగుదేశం కుట్రలు పన్నుతోందని మోదీ పాకిస్థాన్పై విరుచుకుపడ్డారు. అమెరికాపై జరిగిన సెప్టంబర్ 11 దాడులు, ముంబైపై జరిగిన నవంబర్ 26 దాడులకు సూత్రధారులకు పొరుగు దేశం మద్దతిచ్చిందని వివరించారు. ఇక.. రెండో సారి అధికారంలోకి వచ్చిన తీరును మోదీ విశ్లేషించారు. యువత..మహిళలు పెద్ద సంఖ్యలో ఈ సారి ఓటింగ్ లో పాల్గొన్నారని వారి మద్దతుతో దేశంలో ఒకే పార్టీకి మెజార్టీ దక్కిందన్నారు. ఇదంతా తన గొప్ప తనం కాదని.. భారత ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు.
మోదీ ఉద్వేగంగా
ఇక, 370 అధికరణ రద్దు పైన మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. 72ఏళ్లుగా భారత్ను ఇబ్బంది పెట్టిన 370 అధికరణాన్ని రద్దు చేశామని, తద్వారా జమ్మూకశ్మీర్లో అభివృద్ధికి బాటలు వేశామని మోదీ చెప్పారు. రాజ్యసభలో తమకు బలం లేకపోయినా..రెండు సభల్లోనూ ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం లభించదని చెప్పుకొచ్చారు. ఇటువంటి బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతుగా నిలిచిన పార్లమెంట్ సభ్యులకు.. భారత పార్లమెంట్ కు స్టాండింగ్ ఒవేషన్ ద్వారా అభినందించాలని మోదీ కోరారు. దీంతో..అక్కడ హాజరైన వేలాది మంది లేచి నిలబడి కరతాల ధ్వనులతో పార్లమెంట్ కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. తన ప్రసంగం తర్వాత మోదీ ట్రంప్ను వెంటబెట్టుకుని స్టేడియం అంతా కలియతిరిగారు. సభకు హాజరైన ప్రవాస భారతీయులకు అత్యంత సమీపందాకా వెళ్లి ఇద్దరు నేతలూ అభివాదం చేశారు.