న్యూస్ ఛానల్లో ప్రకంపనలు, లైవ్ షో నిలిపివేత, స్టూడియో సిబ్బంది పరుగో పరుగు
ఇరాక్ లోని ఓ న్యూస్ ఛానల్లో లైవ్ ఇంటర్వ్యూ జరుగుతుండగా భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ఆ ప్రకంపనల ధాటిగా స్టూడియో అటుఇటు వూగడం, న్యూస్ ప్రెజెంటర్ కదలడం స్పష్టంగా కనిపించాయి.
టెహ్రాన్ : ఇరాన్, ఇరాక్లను శక్తిమంతమైన భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపానికి 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలారు.
రెండు దేశాల సరిహద్దులో సంభవించిన భారీ భూప్రకంపనలతో వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ భూప్రకంపనల తీవ్రతను తెలిపే పలు దృశ్యాలు బయటకు వస్తున్నాయి.
ఇరాక్ లోని ఓ న్యూస్ ఛానల్లో లైవ్ ఇంటర్వ్యూ జరుగుతుండగా భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ఆ ప్రకంపనల ధాటిగా స్టూడియో అటుఇటు వూగడం, న్యూస్ ప్రెజెంటర్ కదలడం స్పష్టంగా కనిపించాయి.
Caught on #Rudaw: Strong earthquake in #Kurdistan Region. pic.twitter.com/y6WjZW1Lvq
— Rudaw English (@RudawEnglish) November 12, 2017
దీంతో ఆ ఛానల్ వెంటనే లైవ్ కార్యక్రమాన్ని నిలిపివేసింది. భూకంపం సంభవించిన సమయంలో ఎర్బిల్లో రుడా న్యూస్ ఛానల్ ప్రెజెంటర్ సులేమానియా ప్రాంతంలోని ఓ రాజకీయనేతతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
ఈశాన్య ప్రాంతాలైన ఈ రెండు నగరాల్లో అదే సమయంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాజకీయ నేత మాట్లాడుతుండగా స్టూడియో ఒక్కసారిగా షేక్ అయింది. దీంతో ఆ నేత కూడా భయంతో వణికిపోయాడు. వెంటనే స్టూడియోను వదిలి వెళ్లిపోయాడు.
ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్న న్యూస్ ప్రెజెంటర్ కూడా.. ఆ ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని.. అవి తమకు తెలుస్తూనే ఉన్నాయని లైవ్లో చెబుతూ.. తాము సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతున్నామని చెప్పి స్టూడియోను వదిలి వెళ్లిపోయాడు.
దీంతో ఆ లైవ్ కార్యక్రమాన్ని ఆ ఛానల్ అర్థాంతరంగా నిలిపివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రుడా ఛానల్ ట్విటర్లో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది.