పుల్వామా దాడి, యుద్ధమంటూ వాగ్భాణాలు: భారత్-పాక్ బలాబలాలివే, ఎవరివద్ద ఎన్ని?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ నిత్యం భారత్పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. వివిధ రకాలుగా మన దేశాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత్ కూడా పాక్కు ఎప్పటికి అప్పుడు కౌంటర్ ఇస్తోంది. యూరి ఘటన జరిగినప్పుడు సర్జికల్ స్ట్రయిక్స్తో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇప్పుడు పుల్వామా తీవ్రవాద దాడి నేపథ్యంలో పాక్ను ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తోంది మోడీ ప్రభుత్వం.
మరోవైపు, ఇండియన్ ఆర్మీ కూడా దెబ్బ తీయాల్సిందేనని భావిస్తోంది. దేశంలోని మెజార్టీ ప్రజలు పాక్పై యుద్ధం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్ యుద్ధానికి దిగితే తాము సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. మొత్తానికి రెండు దేశాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏ దేశానికి ఎంత బలం ఉంది, ఏ దేశం వద్ద ఎన్ని ఆయుధాలు ఉన్నాయనేది ఇక్కడ చూద్దాం.
ఇదీ నయా పాకిస్తాన్, ఉగ్రవాదానికి అడ్డా: ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం
మిలిటరీ బడ్జెట్
భారత్ 2018లో 58 బిలియన్ డాలర్ల మిలిటరీ బడ్జెట్ కేటాయించింది. ఇది దేశ జీడీపీలో 2.1 శాతం. పాకిస్తాన్ గత ఏడాది 11 బిలియన్ డాలర్లు కేటాయించింది. ఇది పాకిస్తాన్ జీడీపీలో 3.6 శాతం. 2018లో పాకిస్తాన్ విదేశాల నుంచి 100 మిలియన్ డాలర్లను పారెన్ మిలిటరీ అసిస్టెంట్ కింద పొందింది. ఇప్పుడు భారత రక్షణ బడ్జెట్ 4,700 కోట్ల డాలర్లు కాగా, పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ 700 కోట్ల డాలర్లు. 1993 నుంచి 2006 మధ్య పాకిస్తాన్ బడ్జెట్లో 20 శాతానికి పైగా మిలిటరీకి ఖర్చు చేసింది. భారత్ 12 శాతం ఖర్చు చేసింది. 2017లో పాకిస్తాన్ 16.7 శాతం మిలిటరీకి ఖర్చు చేయగా, భారత్ 9.1 శాతం ఖర్చు చేసింది.
ఎవరి వద్ద ఎన్ని క్షిపణులు అంటే
క్షిపణులు, అణ్వాయుధాలు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థల సామర్థ్యం రెండు దేశాలకు ఉంది. 3,000 నుంచి 5,000 కి.మీ. వరకు లక్ష్యాలను ఛేదించే అగ్ని 3తో కలిపి ఇటువంటి తొమ్మిది రకాల క్షిపణి వ్యవస్థలు మన వద్ద ఉన్నాయి. చైనా సాయంతో పాకిస్థాన్ క్షిపణులను తయారు చేస్తోంది. భారత్లోని లక్ష్యాలను ఛేదించగలిగే మొబైల్ షార్ట్, మీడియం రేంజ్ ఆయుధాలు దాయాది దేశం వద్ద ఉన్నాయి. 2,000 కి.మీ లక్ష్యాన్ని ఛేదించగలిగే షహీన్ 3తో కలిపి మొత్తం 10 రకాల క్షిపణులు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 140 నుంచి 150 వరక్ వార్హెడ్స్ ఉండగా, భారత్ వద్ద 130 నుంచి 140 వార్ హెడ్స్ ఉన్నాయి.
ఇరు దేశాల ఆర్మీ
భారత్ జనాభా దాదాపు 130 కోట్లు. పాకిస్తాన్ జనాభా దాదాపు 20 కోట్లు. వీరిలో దళాలకు అసవరమైన ఫిట్నెస్తో ఉన్న వారి సంఖ్య భారత్లో 48 కోట్లు కాగా, పాకిస్తాన్లో 7.5 కోట్లు. భారత్ వద్ద 1.2 మిలియన్ స్ట్రాంగ్ ఆర్మీ ఉంది. పాక్ సైన్యం ఆరు లక్షలకు పైగా ఉంది. రిజర్వ్ దళాలను చూస్తే భారత్కు 28 లక్షల ఉండగా, పాకిస్తాన్కు 2 లక్షల మంది ఉన్నారు. అంటే భారత్ వద్ద మొత్తం దళాల సంఖ్య 42 లక్షలకు పైగా ఉండగా, పాకిస్తాన్ వద్ద దాదాపు 10 లక్షలు ఉంది.
రెండు దేశాల్లో యుద్ధ విమానాలు
భారత్ వద్ద 3,565 బాటిల్ ట్యాంక్స్, 3,100 యుద్ధ వాహనాలు, 336 సాయుధ సిబ్బంది వాహకాలు, 9,719 శతఘ్నిలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 2,496 బాటిల్ ట్యాంక్స్, 1,605 సాయుధ సిబ్బంది వాహకాలు, 4,472 శతఘ్నిలు ఉన్నాయి. 375 స్వయం చోధక ఫిరంగులు ఉన్నాయి.
ఎయిర్ ఫోర్స్
భారత్ వద్ద 2,185 విమానాలు ఉంటే, పాక్ వద్ద 1,281విమానాలు ఉన్నాయి. భారత్ వద్ద 590 ఫైటర్ జెట్స్ ఉంటే, పాక్ వద్ద 320 ఉన్నాయి. దాడి చేసే విమానాలు భారత్ వద్ద 804 ఉంటే, పాకిస్తాన్ వద్ద 410 ఉన్నాయి. రవాణా విమానాలు భారత్ వద్ద 708 ఉండగా, పాకిస్తాన్ వద్ద 296 ఉన్నాయి. శిక్షణ విమానాలు భారత్ వద్ద 251, పాక్ వద్ద 486 ఉన్నాయి. హెలికాప్టర్లు భారత్ వద్ద 720, పాక్ వద్ద 328 ఉన్నాయి. దాడి చేసే హెలికాప్టర్లు భారత్ వద్ద 15, పాక్ వద్ద 49 ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఎయిర్ పోర్టులో భారత్లో 346 ఉండగా, పాక్లో 151 ఉన్నాయి.
నావికా దళం
భారత్ వద్ద 295, పాకిస్తాన్ వద్ద 197 నేవీ బలం ఉంది. విమాన వాహక నౌకలు భారత్ వద్ద ఒకటి ఉంది. పాక్ వద్ద లేవు. జలాంతర్గాములు భారత్ వద్ద 16, పాక్ 5, ఫ్రిగేట్లు భారత్ వద్ద 14, పాక్ వద్ద 10, డెస్ట్రాయర్లు భారత్ వద్ద 11, పాక్ ఏమీలేవు. కొర్వెట్టిలు భారత్ వద్ద 22, పాక్ ఏమీలేవు. పోర్టల్ క్రాఫ్ట్లు భారత్ వద్ద 139, పాక్ 11 ఉన్నాయి. ప్రధాన యుద్ధనౌకలు భారత్ వద్ద 4, పాక్ వద్ద 3 ఉన్నాయి. వాణిజ్య నౌకా బలగం భారత్ వద్ద 1,674, పాక్ వద్ద 52, ప్రధాన నౌకాశ్రయాలు భారత్లో 7, పాక్లో 2 ఉన్నాయి.