భారత్ పాకిస్తాన్ల మధ్య నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం: చైనా
బీజింగ్ : భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనా తన వైఖరిని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని చైనా ఆకాంక్షిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లూకాంగ్ చెప్పారు. షాంఘై సహకార సమాఖ్యలో భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదానికి పరిష్కారం కనుగొంటారా అన్న ప్రశ్నకు లూకాంగ్ సమాధానం ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు దక్షిణాసియాలో ముఖ్యమైన దేశాలని ఆ రెండు దేశాల మధ్య శాంతినెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు లూకాంగ్ తెలిపారు. మరోవైపు చర్చల ద్వారా ఇరుదేశాలు సమస్యకు పరిష్కారం కనుగొనచ్చని డ్రాగన్ కంట్రీ పేర్కొంది.
ఇక ఆసియా ఖండంలో శాంతి నెలకొనేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని వెల్లడించింది చైనా. ఇక భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి చర్చల్లో భాగంగా తాము మధ్యవర్తిత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు... రెండు దేశాలతో చైనా టచ్లో ఉందని లూకాంగ్ పునరుద్ఘాటించారు. భారత్ పాకిస్తాన్లో శాంతి నెలకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని లూకాంగ్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మకమైన పాత్రను చైనా పోషిస్తుందని చెప్పారు.
ఇప్పటికే భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో చైనా నుంచి సానుకూల ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలాకోట్లో గతవారం భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత పరిస్థితి చేదాటి పోతున్న క్రమంలో రెండు దేశాలు నిగ్రహంతో వ్యవహరించాలని చైనా సూచించింది. ఆ సమయంలో ఉగ్రవాదంపై పోరాడాలని అది ఒకరినొకరు సహకరించుకుంటూ జరగాలని లూకాంగ్ అన్నారు.