గాల్వాన్ లోయలో చైనా కిరాతక చర్య.. నాటి ఘర్షణపై అమెరికా ఆగ్రహం.. డ్రాగన్కు వార్నింగ్..
భారత్- చైనా సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాల నుంచి రెండువైపులా బలగాల ఉపసంహరణ కొనసాగుతున్నది. సైనిక, దౌత్యపరమైన చర్చల్లో కుదిరిన అంగీకారం మేరకు దశలవారీగా ఈ డీఎస్కలేషన్ ప్రక్రియ జరుగుతున్నది. బుధవారం నాటికి.. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి చైనా బలగాలు రెండు కీలోమీటర్లు వెనక్కి వెళ్లిపోయాయని సైనిక వర్గాలు తెలిపాయి. కాగా, గాల్వాన్ లోయ ప్రాదేశిక సార్వభౌమత్వంపై, అక్కడ జరిగిన ఘర్షణల్లో మన సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి ప్రశ్నలు సంధిస్తున్నవేళ... నాటి ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది.
చైనా మరో మెలిక.. గాల్వాన్ చేజారిందా? పీపీ14పై ఆర్మీ వ్యూహమిది.. కేంద్రానికి మూడు ప్రశ్నలు
ఇండియాతో సరిహద్దు వివాదంలో చైనా హద్దులు దాటి ప్రవర్తించిందని, గాల్వాన్ లోయలో భారత సైనికులపై కిరాతక చర్యకు ఒడిగట్టిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడియన ఆయన.. గాల్వాన్ ఘర్షణపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో చాలా సార్లు ఫోన్లో మాట్లాడానని తెలిపారు. అయితే, వివాదాన్ని పరిష్కరించుకోవడంలోగానీ, చైనాకు దీటుగా బదులివ్వడంలోగానీ భారత్ తీసుకున్న నిర్ణయాలను కూడా మెచ్చుకోవాల్సిందేనని పాంపియో వ్యాఖ్యానించారు.
ఇండియా సరిహద్దులోనే కాకుండా అటు టిబెట్, హాంకాంగ్ లోనూ చైనా ఆగడాలకు పాల్పడుతోందని పాంపియో మండిపడ్డారు. టిబెట్ లో చైనా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందనే ఆరోపణల నేపథ్యంలో.. చైనా అధికారులపై వీసా ఆంక్షలు విధిస్తున్నట్లు పాంపియో మంగళవారం ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై చైనా సైతం ఘాటుగా స్పందించింది. ''టిబెట్, హాంకాంగ్ మా అంతర్గత విషయాలు. వాటిలో మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. పద్ధతి మార్చుకోకుంటే మేము కూడా అమెరికా పౌరుల వీసాలపై ఆంక్షలు విధించాల్సి వస్తుంది''అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు. బుధవారం బీజింగ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
స్వప్న సురేశ్ వ్యవహారంలో భారీ ట్విస్ట్.. ప్రధాని మోదీ జోక్యం కోరిన సీఎం.. దేశ ప్రతిష్టకు భంగం..
భారత్- చైనా మధ్య యుద్ధం తలెత్తితే తాము చైనాకు వ్యతిరేకంగా పని చేస్తామని, భారత్ కు బలగాలను సైతం పంపుతామని అమెరికా అధ్యక్ష భవంన వైట్ హౌజ్ కీలక ప్రకటన చేయడం తెలిసిందే. అయితే, చైనాతో వివాదాన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామన్న భారత్.. అమెరికా జోక్యాన్ని నివారిస్తూ వస్తోంది. అందుకే వైట్ హౌజ్, పాంపియో వరుస ప్రకటనలు చేస్తున్నా మోదీ సర్కార్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నది.