హైద్రాబాద్కు ఉగ్రముప్పు: సముద్ర, వాయుమార్గాల్లో భారత్లో దాడులకు ప్లాన్!
న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన భద్రతను ఉంచాలని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ముంబైలో 26/11 దాడి తరహాలో ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా భారత్లోకి ప్రవేశించే అవకాశముందని, బిజెపి కార్యాలయాలపై దాడులకు పాల్పడే అవకాశముందని పేర్కొన్నాయి.
26/11 దాడుల సమయంలో ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు మళ్లీ జరగొచ్చని భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని సంబంధిత రాష్ట్రాలకు కూడా సమాచారం అందించాయి.
ముష్కరుల ప్రయత్నాలు అడ్డుకోవాలని హెచ్చరించాయి. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచే హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు మొదలుపెట్టారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నా క్షణాల్లో అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే స్వాట్ బలగాలను మోహరిస్తున్నారు. ఉగ్రవాదులు పారాగ్త్లెడర్లతో వాయుమార్గంలో దాడి చేసే అవకాశముందని హోంమంత్రిత్వ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేసింది.
ఉన్నత హోదాలో ఉండే వ్యక్తులే లక్ష్యంగా ఈ విధ్వంసక చర్యలు చేపట్టొచ్చని హెచ్చరిస్తున్నారు. గురుదాస్పూర్ ఘటన, 2013లో పట్నాలో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్నే లక్ష్యంగా చేపట్టిన వరుసదాడులు కొన్ని సూచనలు ఇస్తున్నాయని, పాక్ ఉగ్రవాదులు, భారత్లోని వారి అనుబంధ సంస్థలైన ఇండియన్ ముజాహిదీన్, మాజీ సిమి సభ్యులు లోటస్ దేవాలయం, నొయిడాలో మాల్స్, మెట్రో స్టేషన్లు, ఎర్రకోట, రాజకీయ ప్రముఖులనే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
భారత నావికా సదుపాయాలు, ఇతర భద్రతలేని తీరనగరాలే లక్ష్యంగా ఉగ్ర సంస్థ భారత ఉప ఖండానికి చెందిన అల్ఖైదా (ఏక్యూఐఎస్) దాడులు చేపట్టేందుకు క్రియాశీలంగా వ్యవహరిస్తోందని ఏప్రిల్ 16న అందిన సమాచారాన్ని అన్ని భద్రతా బలగాలకు, రాష్ట్ర పోలీసు వ్యవస్థలకు హోం మంత్రిత్వశాఖ మరోసారి పంపింది.
బిజెపి కార్యాలయాలు, వాణిజ్య, పర్యటక, మత సంబంధిత ప్రాంతాలు, నావికా, వైమానిక సదుపాయాలపై దాడులకు ఏక్యూఐఎస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందిందని వివరించింది. భారత్-నేపాల్, భారత్-బంగ్లా సరిహద్దుల్లో ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్ బలగాలను సైతం అప్రమత్తం చేశారు.