లాడెన్ను ఇలాగే: సర్జికల్ స్ట్రయిక్ కష్టమే, దిక్కుతోచని పాక్
కరాచీ: ఎల్వోసీ వద్ద ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్ జరిపింది. దీంతో దేశమే కాదు.. పాకిస్తాన్తో సహా ప్రపంచమే ఉలిక్కిపడింది. అయిదేళ్ల క్రితం బిన్ లాడెన్ను కూడా అమెరికా ఇలాగే మట్టుబెట్టింది. అయితే అమెరికా మరింత లోనికి చొచ్చుకెళ్లింది.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు సమీపంలోని అబొట్టాబాదులో ఓ భవంతిలో బిన్ లాడెన్ ఉన్న విషయం గుర్తించారు. అర్ధరాత్రి ఒంటిగంటకు అయిదు హెలికాప్టర్లు ఏ మాత్రం శబ్దం చేయకుండా ఆ భవనం ప్రాంగణంలోకి ప్రవేశించాయి.
అందులోంచి సుశిక్షితులైన కమాండోలు ఆ భవనం పైకి మెరుపువేగంతో దూకి లోపలికి ప్రవేశించారు. తమ లక్ష్యంగా ఉన్న బిన్ లాడెన్ను కాల్చేసి, అతని దేహాన్ని అక్కడున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఇతర సామగ్రిని తరలించారు. ఇదంతా నిమిషాల్లో జరిగింది. ఇలాంటి దాడులను సైనిక పరిభాషలో దీన్ని సర్జికల్ స్ట్రయిక్గా చెబుతారు.
సర్జికల్ స్ట్రయిక్ దాడులు చాలా కష్టమైనవి. ఏమాత్రం తేడా వచ్చినా జరిగే నష్టం చాలానే ఉంటుంది. చాలా కొన్ని దేశాలు మాత్రమే ఇలా చేయగలుగుతాయి. తాజాగా ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్రవాద శిబిరాలపై ఈ దాడి చేసి అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.
దిక్కుతోచని పాక్
ప్రస్తుతం భారత్ చేసిన సర్జికల్ స్ట్రయిక్ పాక్కు మింగలేక కక్కలేని పరిస్థితి. తమ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలు లేవని పాక్ చెబుతోంది. ఇప్పుడు భారత్ సర్జికల్ స్ట్రయిక్ చేసింది. తమ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలు లేవని వాదించిన పాక్.. తమ శిబిరాల మీద దాడి జరిగిందని అంగీకరిస్తే ప్రపంచం ముందు ఉగ్రవాద నిజం అంగీకరించవలసి ఉంటుంది. అందుకే ఫైరింగ్ జరిపిందని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది.