భారత్-చైనా సంబంధాల్లో కీలక అడుగు- ఇరుదేశాల విదేశాంగమంత్రుల మధ్య హాట్లైన్
భారత్, చైనా మధ్య గతేడాది సరిహద్దు ఘర్షణలు, ఉద్రిక్తతలతోనే కాలం గడిచిపోయింది. కరోనా సమయంలోనూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి వచ్చేసింది. అయితే తాజాగా ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం కాస్త తగ్గింది. పలుదఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఇరుదేశాలూ సరిహద్దుల్లో తమ బలగాల్ని ఉపసంహరించుకున్నాయి.
Recommended Video
భారత్-చైనా మధ్య సంబంధాలు బలహీనంగా మారిన నేపథ్యంలో తాజాగా చేపట్టిన బలగాల ఉపసంహరణ ఇరుదేశాల్లోనూ విశ్వాసం నింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా చైనా విదేశాంగమంత్రి వాంగ్యీతో మాట్లాడిన భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తరచూ చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకు వీలుగా ఇరుదేశాల విదేశాంగమంత్రుల మధ్య ఓ హాట్లైన్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. గతేడాది చైనాతో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత మారుతున్న పరిస్ధితికి ఇదో నిదర్శనంగా పరిశీలకులు చెప్తున్నారు.
చైనా విదేశాంగమంత్రి వాంగ్యీతో చర్చల తర్వాత ఇరుదేశాల విదేశాంగమంత్రులు టచ్లో ఉండాలని, హాట్లైన్ కూడా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగమంత్రిత్వశాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చైనా విదేశాంగశాఖ నుంచి కూడా దాదాపు ఇదే విధమైన ప్రకటన వెలువడింది.
ఇప్పటికే మిలటరీ అధికారుల మధ్య ఉన్న హాట్లైన్కు అదనంగా విదేశాంగమంత్రుల మధ్య కూడా కొత్త హాట్లైన్ ఏర్పాటుకు ఇరువురూ అంగీకరించినట్లు ఆ ప్రకటన తెలిపింది. భారత్, చైనా విదేశాంగమంత్రుల మధ్య తాజాగా జరిగిన ఫోన్ కాల్ గంటా 15 నిమిషాల పాటు సాగిందని, ఇందులో వాస్తవాధీన రేఖ వద్ద తాజా పరిస్ధితితో పాటు ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చించినట్లు తెలిసింది.