చైనాపై కొత్త స్ట్రాటజీ: టైమ్, ప్లేస్ ఫిక్స్: చర్చల్లో పాల్గొనబోయేది వీరే: భారీ బ్యాక్గ్రౌండ్
న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణానికి..సరిహద్దు వివాదానికి.. తెర దించే దిశగా తొలి అడుగు కాస్సేపట్లో పడబోతోంది. మాటిమాటికీ సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి వచ్చి మరీ బుసలు కొడుతోన్న డ్రాగన్ కంట్రీతో భారత్ చర్చలకు సిద్ధపడింది. లడక్ సెక్టార్లోని భారత్కు చెందిన కొంత భూభాగాన్ని తమదేనంటూ రచ్చ చేస్తోన్న చైనా దూకుడును చర్చల ద్వారా బ్రేక్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాయాత్తమైంది. తొలి విడత చర్చలకు శనివారం శ్రీకారం చుట్టింది. డ్రాగన్ దూకుడును అడ్డుకోవడానికి భారత్ తన వ్యూహాన్ని చర్చల దిశగా మల్లించింది.
Recommended Video
చైనాకు భారత్ స్నేహ హస్తం: చర్చల ద్వారా: 6న తొలి విడత: లెప్టినెంట్ స్థాయిలో మిలటరీ
చర్చలకు వేదికగా మారిన..
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య లెప్టినెంట్ జనరల్ స్థాయి మిలటరీ అధికారుల మధ్య చర్చలు ఆరంభం కాబోతున్నాయి. ఈ చారిత్రాత్మక సంఘటనకు లడక్ సరిహద్దు ప్రాంతం వేదికగా మారింది. చైనా భూభాగంలోని మాల్డోలో ఈ రెండు దేశాల మధ్య చర్చలకు వేదికగా మారింది. భారత్ భూభాగంపై సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఛుసుల్కు సమీపంలో ఉంటుందీ మాల్దో.
పాల్గొనబోయేది వీరే..
రెండు దేశాల మిలటరీ తరఫున లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొనబోతున్నారు. మనదేశ ఆర్మీ తరఫున 14 కార్ప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ దీనికి సారథ్యం వహించనున్నారు. హరీందర్ సింగ్ నేతృత్వంలోని భారత ఆర్మీ ప్రతినిధుల బృందం ఈ చర్చలకు హాజరవుతుంది. చైనా తరఫున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొననున్నారు. చైనా దక్షిణ ప్రాంత గ్ఝిన్జియాంగ్ మిలటరీ రీజియన్కు ఆయన కమాండర్.
అజెండా అదొక్కటే..
కాస్సేపట్లో ఆరంభం కాబోతోన్న ఈ చారిత్రాత్మక చర్చల అజెండా.. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడమే. సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడాన్ని నిరోధించుకోవడం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం, సరిహద్దుల్లో పహారా కాస్తోన్న రెండు దేశాల జవాన్ల మధ్య ఘర్షణపూరక, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ చర్చలు కేవలం లడక్ సెక్టార్కు మాత్రమే పరిమితం కానున్నాయి. సిక్కిం గానీ, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వివాదం ఈ చర్చల సందర్భంగా ప్రస్తావనకు రాకపోవచ్చని అంటున్నారు.
చైనా వైఖరి పట్ల అమెరికా ఆగ్రహం..
భారత్తో సరిహద్దుల వద్ద చైనా పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించడంపై అమెరికా ఇదివరకే ఆందోళన వ్యక్తం చేసింది. చైనా వ్యవహరించే తీరు ఆ దేశ పాలకుల నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించింది. చైనా చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత, అడ్డుకోవడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని పేర్కొంది. వాస్తవాధీన రేఖ వద్ద చైనా దూకుడుగా ప్రవర్తన తీవ్ర ఆందోళనకరమని, దౌత్యాన్ని నిర్వహించడానికి తాము సిద్ధమని స్పష్టం చేసింది.