కరోనా పుట్టుక తేలాల్సిందే- -డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు- డ్రాగన్ టార్గెట్ గా భారత్ అడుగులు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాలపైనా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ మహమ్మారిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి వివిధ దేశాలు ఇప్పటికే దర్యాప్తు చేపట్టాయి. చైనాలోని వుహాన్ సిటీలోని ఓ ప్రయోగశాలలో ఈ వైరస్ పుట్టిందంటూ ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని పుట్టు పూర్వోత్తరాలపై ఓ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెరుగుతోంది.
Recommended Video
7 నెలల గర్భిణీకి కరోనా వైరస్, యాదాద్రి జిల్లాలో కలకలం, భువనగిరి ఎయిమ్స్లో చికిత్స...
కరోనాపై స్వతంత్ర దర్యాప్తు ?
దేశవిదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రభుత్వాల వరకూ అందరి నోటా వినిపిస్తోంది. అదే సమయంలో కరోనా వైరస్ మూలాలు చైనాలోనే ఉన్నాయని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్దలను అతలాకుతలం చేయడం ద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని డ్రాగన్ దేశం చైనా ప్రయత్నించిందని అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. అంతర్జాతీయంగా అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ఇదే డిమాండ్ తో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వార్షిక సదస్సు సందర్భంగా మొత్తం 62 దేశాల నుంచి ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
స్వతంత్ర దర్యాప్తు డిమాండ్ కు భారత్ మద్దతు..
కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయంగా ఓ స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు చేయించి బాధ్యులను శిక్షించాలన్న డిమాండ్ కు భారత్ కూడా మద్దతిచ్చింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ వార్షిక సదస్సులో ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా నేతృత్వంలోని 62 దేశాలు చేసిన డిమాండ్ కు భారత్ మద్దతు పలికింది. ప్రపంచంలో ఇతర దేశాలతో పాటు కరోనా వైరస్ బాధిత దేశంగా ఉన్న భారత్.. కరోనా పుట్టుకపై స్వతంత్ర దర్యాప్తు చేయించాల్సిందేనని తాజాగా డిమాండ్ చేసింది.
డ్రాగన్ దేశం టార్గెట్ గా....
కరోనా వైరస్ ముందుగా ఎక్కడ బయటపడింది అంటే చైనాలోని వుహాన్ మార్కెట్లో అని అందరూ చెప్తున్నారు. కానీ దాన్ని నిరూపించేందుకు మాత్రం ఆధారాలు లేవు. అయితే చైనాలో ముందుగా బయటపడిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని చైనాను ప్రపంచదేశాలు బహిష్కరించాలని, ఆంక్షలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారు. మామూలుగా ఏదో వాణిజ్య డిమాండ్ అయితే మిగతా దేశాలు కూడా లైట్ తీసుకునేవి. కానీ తమ ఆర్ధిక వ్యవస్ధలను నాశనం చేసిన కరోనా వైరస్ మూలాలు చైనాలో ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా సైలెంట్ గా ఉండేందుకు మిగతాదేశాలకు మనసు ఒప్పుకోవడం లేదు. దీంతో ఎక్కడా చైనా పేరెత్తకుండానే ప్రపంచ ఆరోగ్య సంస్ధ ద్వారా స్వతంత్ర దర్యాప్తుకు వారంతా డిమాండ్ చేస్తున్నారు.
అంతా వ్యూహాత్మకమే...
చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్ద వేదికగా 62 దేశాల ప్రతినిధులు తీసుకొచ్చిన ముసాయిదా తీర్మానంలో ఎక్కడా చైనా పేరు కానీ వుహాన్ సిటీ పేరు కానీ లేవు. అలాగే స్వతంత్ర దర్యాప్తుకు బదులుగా మదింపు అనే పదాన్ని వాడారు. వైరస్ కు ఏ జంతువు కారణమైంది, అది మానవుల్లోకి ఎలా ప్రవేశించింది ? మధ్యలో ఎవరి పాత్ర ఉంది ? ఇలా పలు అంశాలను ఈ మదింపులో చేర్చారు. అన్నింటికంటే మించి చైనాను ఈ విషయంలో ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ పెద్దన్న దేశం అమెరికా దీనిపై ఇంకా తన వైఖరి వెల్లడించలేదు. అంటే వ్యూహాత్మకంగానే తాను బయటపడకుండా తన మిత్రులను ప్రోత్సహిస్తున్నట్లు అర్దమవుతోంది.
మండిపడుతున్న డ్రాగన్...
కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునే పేరుతో తనను ప్రపంచ దేశాలు టార్గెట్ చేస్తున్నాయని ముందే గ్రహించిన చైనా ఈ తీర్మానంపై మండిపడింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు పలు దేశాల నిపుణులు ఈ వైరస్ వుహాన్ ల్యాబ్ లో తయారైందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసినట్లు చెబుతోంది. అయినా ఈ రాద్ధాంతం ఏమిటని ప్రశ్నిస్తోంది.