జకీర్ నాయక్ వదిలించుకుందామనుకుంటున్నాం: మోడీ సహా ఎవరూ అడగట్లేదు: మలేసియా
కౌలాలంపూర్: ముంబైకి చెందిన వివాదాస్పద మత ఉపన్యాసకుడు జకీర్ నాయక్ ను తాము వదిలించుకోవాలని చూస్తున్నామని మలేసియా ప్రధానమంత్రి మహథిర్ మహమ్మద్ తెలిపారు. ఏ దేశం కూడా ఆయనను తమకు అప్పగించమని అడగట్లేదని ఆయన అన్నారు. చివరికి జకీర్ నాయక్ స్వదేశం భారత్ కూడా.. ఆయనను పంపించమని కోరట్లేదని చెప్పారు. జకీర్ నాయక్ వివాదాస్పద ఉపన్యాసాల వల్ల తమ దేశంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తడానికి అవకాశం ఉన్నట్లు నివేదికలు అందుతున్నాయని, అందువల్లే ఏ ఒక్కరు కూడా ఆయనను తమకు అప్పగించమని కోరట్లేదని అన్నారు. జకీర్ నాయక్ ను తమ దేశం నుంచి పంపించేయాలని చూస్తున్నామని మహమ్మద్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
సీమ కరవు తీరా: కర్నూలు, అనంతల్లో భారీవర్షం: నీట మునిగిన మహానంది: గర్భగుడి వరకూ గంగమ్మ!
వివాదాస్పద మత ఉపన్యాసకుడిగా పేరున్న జకీర్ నాయక్ స్వస్థలం ముంబై. ఆయనపై 2016లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలిసిందే. జకీర్ నాయక్ ప్రసంగాలను విని తాము ఆకర్షితులమయ్యామని ఉగ్రవాదులు ఈ సందర్భంగా వెల్లడించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనితో ఎన్ఐఏ ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అదే సంవత్సరం దేశం విడిచి వెళ్లిపోయారు.ప్రస్తుతం మలేసియాలో నివసిస్తున్నారు. జకీర్ నాయక్ కు మలేసియా పౌరసత్వం కూడా లభించింది. తరచూ అక్కడ కూడా ఆయన మతపరమైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
తమ దేశంలో నివసిస్తోన్న జకీర్ నాయక్ వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగ వచ్చని ఆ దేశ ప్రభుత్వం సైతం భావిస్తోంది. జకీర్ నాయక్ ఉపన్యాసాల వల్ల మలేషియాలో నివసించే హిందువులు అభద్రతా భావానికి గురవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, అందువల్లే ఆయనను పంపించేయాలని భావిస్తున్నట్లు మహథిర్ మహమ్మద్ చెప్పారు. రష్యాలో ఇటీవలే ముగిసిన శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తాను భారత ప్రధనమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యానని గుర్తు చేశారు. జకీర్ నాయక్ ను స్వదేశానికి అప్పగించమని మోడీ సైతం తనను కోరలేదని అన్నారు. అప్పగింతపై మోడీ తన వద్ద ఎలాంటి ప్రస్తావనను తీసుకుని రాకపోవడానికి ప్రధాన కారణం.. జకీర్ నాయక్ వల్ల భారత్ కు ఇబ్బందులు తలెత్తటమేనని తాను అనుమానిస్తున్నట్లు చెప్పారాయన.
భారత్ ఒక్కటే కాదని, ఏ దేశం కూడా ఆయనను తమకు అప్పగించాలని కోరకపోవటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. జకీర్ నాయక్ కు తమ దేశ పౌరసత్వాన్ని గత ప్రభుత్వం అందజేసిందని, ఆ బాధ్యత తమది కాదని మహథిర్ మహమ్మద్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఆయనకు పౌరసత్వాన్ని కల్పించేది కాదేమోనని అన్నారు. పౌరసత్వం ఉన్నప్పటికీ, శాశ్వత చిరునామాను కల్పించినప్పటికీ.. జకీర్ నాయక్ పుట్టుకతో మలేసియన్ కాదని మహథిర్ చెప్పుకొచ్చారు. తమ దేశ పౌరసత్వ నిబంధనలు కొన్నింటిని ఆయన ఉల్లంఘించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. బహిరంగ ఉపన్యాసాలను నిషేధించే దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని మహథిర్ తెలిపారు.