ప్రపంచంలోనే మోడీ ప్రభుత్వం బెస్ట్: తాజా సర్వే ఏం చెబుతోందంటే?
ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజల విశ్వాసం పొందిన పాలనను భారతదేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అందిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజల విశ్వాసం పొందిన పాలనను భారతదేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అందిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
మోడీ ప్రపంచంలోనే బెస్ట్
దాదాపు 73శాతం మంది భారతీయులు ప్రధాని మోడీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమం కావడం విశేషం.
ట్రంప్నకు దగ్గన పాస్ మార్కులు
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై కేవలం 30శాతం మంది మాత్రమే విశ్వాసం ఉంచినట్లు ఈ సర్వే తేల్చింది. కాగా, భారత్ తర్వాతి స్థానంలో కెనడా ఉంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై 62శాతం మంది కెనడియన్లు విశ్వాసం ఉంచినట్లు సర్వేలో వెల్లడైంది.
మూడో స్థానంలో రష్యా
ఆ తర్వాతి స్థానాల్లో టర్కీ(58శాతం), రష్యా(58శాతం), జర్మనీ(55శాతం) ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం.. బ్రెగ్జిట్ సంక్షోభంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న బ్రిటన్ థెరిస్సా మే ప్రభుత్వంపై 41శాతం మంది ప్రజలు విశ్వాసం ఉంచారు. అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై కారణంగా ఆ దేశ ప్రభుత్వంపై కేవలం 25శాతం మంది ప్రజలు మాత్రమే నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం ఏ మేరకు?
ప్రస్తుత అధికార ప్రభుత్వం స్థిరంగా ఉండగలదో లేదో అనే దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. అంతేగాక, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజలను రక్షించగలదా? లేదా ప్రజల సేవలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుందా? అనే అంశాలను కూడా ఈ ఓఈసీడీ సర్వే పరిగణలోకి తీసుకుంది.