చొక్కా పట్టి ఈడ్చుకెళ్లి, చేయి విరిచి: మాజీ అధ్యక్షుడిపై పోలీసులు
మాల్దీవులు: పోలీసులు మాల్దీవులు మాజీ అధ్యక్షుడి పట్ల దారుణంగా ప్రవర్తించారు. పోలీసులు అతనిని కోర్టుకు ఈడ్చుకెళ్లారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్. ప్రస్తుతం అతను ప్రతిపక్ష నాయకుడు. అతను క్రిమినల్ కోర్టు ఎదుట విలేకరులతో మాట్లాడే సమయంలో పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు.
జర్నలిస్టులతో మాట్లాడకుండా ఉండేందుకు అతనిని ఊడ్చుకు పోయారు. ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. 2012లో అతను అధికారంలో ఉన్న సమయంలో యాంటీ టెర్రరిజం లాను చట్టవిరుద్ధంగా ఉపయోగించారని అతని పైన ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసుకు సంబంధించి లాయర్లను నియమించుకోవాలని కోర్టు అతనికి మూడు రోజుల సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టుకు తీసుకు వచ్చిన అతను జర్నలిస్టులతో మాట్లాడుతుండగా.. పోలీసులు అడ్డుకొని ఈడ్చుకెళ్లారు. అతనికి కోర్టు బెయిల్ నిరాకరించింది.
ఈ ఘటనలో అతనికి ముంజేయి ఎముక విరిగింది. మరోవైపు, అతనిని వ్యక్తిగత లాయరును కలవనీయలేదు. విచారణ పూర్తయ్యే వరకు పోలీసు కస్టడీలోనే ఉంచాలని ఆదేశించారు. ఈ మొత్తం ఘటన పైన అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
చొక్కా పట్టి లాక్కొచ్చిన పోలీసులు.. తనకు గాయాలు అయితే కనీసం వైద్యుడి వద్దకు కూడా తీసుకు పోలేదని నషీద్ కోర్టులో జడ్జి ముందు చెప్పారు. తన చేయి విరిగిందని చెప్పాడు. అయితే, జడ్జి అతని విజ్ఞప్తిని వినిపించుకోకుండా ప్రొసీడింగ్స్ సాగించారని సమాచారం. అతను దేశం పారిపోతాడని భావించి అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ నేత నషీద్ అరెస్టును మాల్దీవుల ప్రభుత్వం సమర్థించింది.
కాగా, మొహమ్మద్ నషీద్ను పోలీసులు ఈడ్చుకెళ్లడం పైన భారత్ స్పందించింది. మాల్దీవులలో ఇటీవలి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని.. మాజీ అధ్యక్షుడు నషీద్ అరెస్టును ఉద్దేశించి చెప్పాయి. నషీద్ పైన పోలీసుల దాడి దురదృష్టకరమని, నిష్పక్షపాత విచారణ జరగాలని ప్రధాని మోడీ అన్నారు. కాగా, ప్రధాని మోడీ మార్చి నెలలో మాల్దీవులలో పర్యటించాల్సి ఉంది.