ఫ్రాన్స్కు మద్దతు, అధ్యక్షుడు మాక్రాన్పై వ్యక్తిగత దాడిని ఖండిస్తున్నాం: భారత్
న్యూఢిల్లీ/ప్యారిస్: విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించిన టీచర్ తలను నరికిన ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రాన్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఉగ్రదాడిగా ఆయన అభివర్ణించారు. కాగా, ఆ దారుణానికి పాల్పడిన నిందితుడ్ని పోలీసులు కాల్చి చంపేశారు.
ఈ నేపథ్యంలో భారత్ ఈ ఘటనపై స్పందించింది. ఫ్రాన్స్కు భారత మద్దతు ఉంటుందని, ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రాన్పై వ్యక్తిగత దాడులను తాము ఖండిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇస్లామఫోబియా వ్యాఖ్యలతో టర్కీ, పాకిస్థాన్ లాంటి దేశాల నుంచి మాక్రాన్పై వ్యక్తిగత విమర్శలు వస్తున్నాయి.
'అంతర్జాతీయ ప్రసంగం ప్రాథమిక ప్రమాణాలను ఉల్లంఘిస్తూ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్పై వ్యక్తిగత దాడులను మేము ఒప్పుకోలేము" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఉపాధ్యాయుడి కుటుంబానికి, ఫ్రాన్స్ ప్రజలకు సంతాపాన్ని తెలియజేస్తూ.. ఎంఈఏ ఈ మేరకు స్పందించింది. 'ఒక ఫ్రెంచ్ ఉపాధ్యాయుడి జీవితాన్ని క్రూరమైన ఉగ్రదాడిలో బలి చేశారు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఉగ్రదాడిని మేము ఖండిస్తున్నాము' అని భారత్ తెలిపింది.
ఏ కారణం చేతనైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదానికి ఎలాంటి సమర్థన లేదని స్పష్టం చేసింది.మహ్మద్ ప్రవకర్త కార్టూన్ చూపించిన సామ్యూల్ ప్యాటీ అనే ఉపాధ్యాయుడిని ఓ 18 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆయన తలను నరికేశాడు. అయితే, ఈ ఘటనపై పాకిస్థాన్, టర్కీ భిన్నంగా స్పందించాయి. ఇమ్మాన్యుయెల్ మాక్రాన్పై విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో భారత్కు ఫ్రాన్స్, మాక్రాన్కు మద్దతు తెలిపింది.
కాగా, సదరు ఉపాధ్యాయుడు.. భావవ్యక్తీకరణ టాపిక్పై క్లాస్లో చర్చ జరుగుతున్న సమయంలో పిల్లలకు మహ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించినట్లు తెలుస్తోంది. అయితే అంతకు ముందు ముస్లిం సామాజిక వర్గంకు చెందిన విద్యార్థులను క్లాసు నుంచి బయటకు పంపివేసినట్లుగా ఇతర విద్యార్థులు చెబుతున్నారు.
ముస్లిం విద్యార్థులను క్లాసు బయటకు పంపి వివాదానికి టీచర్ తెరలేపారని ఓ విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు. మొహ్మద్ ప్రవక్త కార్టూన్ చూపేముందు ముస్లిం విద్యార్థులందరినీ బయటకు వెళ్లాల్సిందిగా టీచర్ చెప్పారని.. వారిని బాధపెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పి ముస్లిం విద్యార్థులను బయటకు పంపారని తన కొడుకు చెప్పినట్లు ఓ పేరెంట్ వివరించారు.
ఇక ఈ ఘటనతో ప్యారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పోలీసులు ఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు అక్కడ పెట్టారా అన్న కోణంలో జాగిలాలతో చెక్ చేయించారు. ఈ హత్య ఫ్రాన్స్ పార్లమెంటును కుదిపేసింది.