శ్రీలంక నుంచి వ్యూహం, డ్రాగన్కు చెక్: చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్
భారత్ - చైనా - భూటాన్ సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంతో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా మోడీ ప్రభుత్వం ఎత్తుకుపైఎత్తులు వేస్తోంది.
న్యూఢిల్లీ/కొలంబో: భారత్ - చైనా - భూటాన్ సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంతో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ పావులు కదుపుతోంది. అందులో భాగంగా మోడీ ప్రభుత్వం ఎత్తుకుపైఎత్తులు వేస్తోంది.
ఇతర దేశాలను కలుపుతూ వన్ బెల్ట్ వన్ రోడ్డు పేరిట వ్యూహాత్మకంగా చైనా ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకు షాకిచ్చేందుకు భారత్ సిద్ధమయ్యింది.
చైనాకు షాకిచ్చేలా
శ్రీలంక దక్షిణ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకంగా చైనా నిర్వహిస్తున్న పోర్టుకు సమీపంలో పెట్టుబడి పెట్టేందుకు భారత్ ముందుకు వచ్చింది. ఇక్కడి ఎయిర్ పోర్ట్ నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆ దేశంతో చర్చలు జరుపుతోంది.
ఈ పోర్టును 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న చైనా
ఈ విషయాన్ని శ్రీలంక విమానయాన శాఖ మంత్రి నిమల్ సిరిపాల తెలిపారు. శ్రీలంకకు దక్షిణాన ఉన్న హంబన్తోట నగరంలో వన్ బెల్ట్ వన్ రోడ్డులో భాగంగా చైనా పోర్టును నిర్వహిస్తోంది. ఆసియా సహా యూరప్ దేశాలకు వ్యాపార, వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ పోర్టుని చైనా 99 ఏళ్లపాటు లీజుకు తీసుకుంది.
చైనా ప్రాజెక్టుపై శ్రీలంకలో స్థానికుల నుంచి వ్యతిరేకత
విస్తరణలో భాగంగా రిఫైనరీ ప్లాంట్నూ నిర్మించాలని చైనా భావిస్తోంది. కానీ ఈ ప్రాజెక్టును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు శ్రీలంక ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. దేశాన్ని శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోయే ప్రతిపాదనపై సంతకం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
293 మిలియన్ డాలర్ల పెట్టుబడి
ఈ నేపథ్యంలో హంబన్తోటకు సమీపంలో ఉన్న మట్టాలా ఎయిర్ పోర్ట్ నిర్వహించేందుకు భారత్ ముందుకు వచ్చింది. నష్టాల్లో ఉన్న ఈ పోర్టును లాభాల బాట పట్టించేందుకు శ్రీలంకతో కలిసి పని చేసేందుకు సిద్ధమని భారత్ చెప్పింది. ఇందుకోసం 70 శాతం వాటాగా 293 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
ఇరు దేశాలకు లాభం
నలభై ఏళ్ల పాటు ఎయిర్ పోర్టును లీజుకు తీసుకునేందుకు చర్చలు జరుపుతోంది. ఎయిర్ పోర్ట్ ఆదాయం పెంపులో భాగంగా ఇక్కడ ఓ ఫ్లైయింగ్ స్కూల్తో పాటు, మెయింటెనెన్స్ హబ్గా మార్చేందుకు సిద్ధపడింది. దీని వల్ల ఇరు దేశాల మధ్య పర్యాటకం కూడా వృద్ధి చెందుతుందని చెబుతున్నారు.
చైనాకు దక్కలేదు
తొలుత ఈ విమానాశ్రయం నిర్వహణకు చైనా బిడ్ వేసినప్పటికీ ఆర్థికంగా అవగాహన కుదరకపోవడంతో చైనాకు దక్కలేదు. భారత్ను శ్రీలంక ఆహ్వానిస్తున్న విషయం తనకు తెలీదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.