శోచనీయం: వరల్డ్ టాప్ 300లోనూ భారత యూనివర్సిటీలకు దక్కని చోటు
న్యూఢిల్లీ: 2020 ఏడాదికి గానూ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 300 అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఈసారి భారత్ నుంచి ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా చోటు దక్కకపోవడం శోచనీయం. టాప్ 300లో భారత విద్యా సంస్థలు లేకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ వ్యాప్తంగా విద్యా సంస్థల ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. 2020 సంవత్సరానికి గానూ విడుదల చేసిన ఈ జాబితాలో తొలి 300 యూనివర్సిటీల్లో భారతదేశానికి చెందిన ఏ ఒక్క విద్యా సంస్థ కూడా చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.
గత సంవత్సరం టాప్-300లో చోటు దక్కించుకున్న ఏకైక భారత విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరుకు కూడా ఈ సారి 300లోపు జాబితాలో చోటు దక్కలేదు. గత ఏడాది 251-300 జాబితాలో ఉన్న ఐఐఎస్సీ.. ఈసారి 301-350 జాబితాలోకి పడిపోయింది.
ఐఐటీ-రోపర్ కూడా 301-350 గ్రూపులోనే చోటు దక్కించుకుంది. ఈ విద్యా సంస్థ గత ఏడాది జాబితాలో లేదు. ఇక ఐఐటీ ఇండోర్ 351-400 ర్యాంక్ గ్రూప్లో స్థానం దక్కించుకుంది. ఐఐటీ ముంబై, ఢిల్లీ, ఖరగ్పూర్ విద్యాసంస్థలు 401-500 ర్యాంక్ గ్రూప్లో చోటు దక్కించుకున్నాయి.
కాగా, ఈ జాబితాలో వరుసగా నాలుగోసారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి రెండో ర్యాంక్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, మసాజుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నాయి.
కాగా, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ జాబితాను విడుదల చేయడం ఇది 16వ సారి కావడం గమనార్హం. 92 దేశాల్లోని 1300 యూనివర్సిటీలను పరిశీలించిన తర్వాత 2020 సంవత్సరానికి గాను ఈ జాబితాను విడుదల చేసింది.