ముంబై పేలుళ్లతో లఖ్వీకి సంబంధం లేదు: సయీద్, భారత్ ఫైర్
లాహోర్: ముంబై దాడుల కేసు నిందితుడు జకియుర్ రెహమాన్ లఖ్వీ అమాయకుడని నిషేధిత జమాత్-ఉద్-దవా నేత హఫీజ్ సయీద్ అన్నాడు. ఐక్యరాజ్యసమితిని, అమెరికాను అడ్డంపెట్టుకొని భారత్ పాకిస్థాన్పై ఒత్తిడి చేస్తోందని ఆరోపించాడు.
లఖ్వీకి వ్యతిరేకంగా భారత్ వద్ద ఎటువంటి ఆధారాలూ లేవని. అనవరసంగా అతడ్ని శిక్షించాల్సిందిగా పాకిస్థాన్పై ఒత్తిడి చేస్తోందని సోమవారం ఓ టీవీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో సయీద్ వ్యాఖ్యానించాడు. అలాంటి ఒత్తిడులకు పాక్ లొంగిపోదని ఆయన అన్నారు.
లఖ్వీని విడుదల చేస్తూ లాహోర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. దానిపై సత్వర విచారణ చేపట్టాల్సిందిగా కోరింది. కాగా, హఫీజ్ వ్యాఖ్యలను భారత దేశం ఖండించింది. ‘దొంగలు దొంగలకే' మద్దతు ఇస్తారని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వ్యాఖ్యానించారు. దొంగలు సోదరులయ్యారని ఆయన అన్నారు.
నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాది లఖ్వీ విడుదల వ్యవహారం భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య కొత్త వివాదానికి దారి తీసింది. లఖ్వీ విడుదల అంశంపై భారత్ ఐక్యరాజ్య సమితికి పిర్యాదు చేసింది.