భారత్లో కుబేరులు 2,083: పేదరికమూ ఉంది
ఢిల్లీ: భారత దేశంలో 50 మిలియన్ డాలర్లు అంటే... దాదాపు రూ.300 కోట్ల సంపద కలిగిన కుబేరులు 2,083 మంది ఉన్నారని క్రెడిట్ సూయిజ్ గ్లోబల్ వెల్త్ నివేదిక మంగళవారం నాడు వెల్లడించింది. గత ఏడాది 2014తో పోలిస్తే ఇది మూడు శాతం అధికం అని చెప్పింది.
ఇక 940మంది వద్ద 100 మిలియన్ డాలర్ల సంపద అంటే... దాదాపు రూ.650 కోట్లు ఉందని పేర్కొంది. దేశంలో మిలియనీర్ల సంఖ్య వచ్చే అయిదేళ్లలో అరవై అయిదు శాతం పెరగనుందని పేర్కొంది. 2020 నాటికి వీరి సంఖ్య 3,05,000లకు చేరుతుందని సంస్థ అంచనా వేసింది.
ప్రస్తుతం 1,85,000 మంది మిలియనీర్లు ఉన్నారు. అంతర్జాతీయ సంక్షోభ సమయం మినహా 2000 నుంచి భారత్లో వృద్ధి వేగవంతమైందని తెలిపింది. మధ్యతరగతి కుటుంబాల సంపద పెరిగిందని, అలాగే వారి సంఖ్య కూడా పెరిగిందని పేర్కొంది. అసమానత కూడా ఉందని తెలిపింది.
సంపదను దేశీయ కరెన్సీలో లెక్కించినప్పుడు భారత్లో ధనికుల సంఖ్య 2000 సంవత్సరం నుంచి శరవేగంగా వృద్ధి చెందుతూ (సంక్షోభాలు ఏర్పడ్డ సంవత్సరాలు మినహాయించి) వచ్చిందని పేర్కొంది. దేశంలో సంపద గణనీయంగా పెరుగుతున్నదని, మధ్యతరగతి, ధనిక వర్గాల ర్యాకింగ్ పెరుగుతూ పెరుగుతోందని పేర్కొంది.
అయినప్పటికీ భారత్లో పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని నివేదిక తెలిపింది. దేశంలోని 95 శాతం మంది పెద్దవాళ్ల దగ్గరున్న సంపద 10 వేల డాలర్ల (రూ.6 లక్షలు) లోపేనని, లక్ష డాలర్ల (రూ.60 లక్షలు) కంటే అధిక సంపద కలిగిన వారి వాటా కేవలం 0.3 శాతమేనని పేర్కొంది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశం కావడంతో ఈ 0.3 శాతం వాటా 24 లక్షల మందికి సమానం అని చెప్పింది.దేశంలో మధ్యతరగతి వయోజనుల వాటా 3 శాతంగా ఉందని, ఈ పదిహేనేండ్లలో వీరి వాటా 150 శాతం వృద్ధి చెంది 78 వేల కోట్ల డాలర్లకు (రూ.46.80 లక్షల కోట్లు) చేరుకుందని, దేశంలోని మొత్తం సంపదలో ఈ విభాగం వారి వాటా 23 శాతమని తెలిపింది.